న్యూఢిల్లీ : అవినీతి ఆరోపణలపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తనయుడు జే షా స్పందించారు. తనపై తీవ్ర ఆరోపణలు గుప్పించిన వెబ్సైట్(ది వైర్)పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమిత్ షాకు చెందిన రెండు కంపెనీలు భారీగా లాభాలు సాధించడంపై ది వైర్.ఇన్ అనే ఆంగ్ల వెబ్సైట్ కథనాన్ని ప్రచురించింది.
ప్రభుత్వం, ప్రైవేటు కంపెనీల నుంచి భారీ ఎత్తున అమిత్ షాకు చెందిన కంపెనీల్లోకి భారీ ఎత్తున పెట్టుబడులు అక్రమంగా వచ్చాయని పేర్కొంది. ది వైర్ కథనంపై స్పందించిన కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబాల్.. దేశంలో జే, అమిత్, షా అని పేర్లు పెట్టుకున్న వారిని అరెస్టు చేయలేం అని అన్నారు. షా కంపెనీలలో అవినీతి ప్రధానమంత్రి సీబీఐ విచారణకు ఆదేశిస్తారా? అని ప్రశ్నించారు. సిబాల్ విమర్శలపై స్పందించిన రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ జే షాకు చెందిన కంపెనీలు పారదర్శకంగానే లోన్లు పొందాయని పేర్కొన్నారు.
వైర్ కథనం ఏంటి..
2014లో అధికారంలోకి రాకముందు వరకూ జే షాకు చెందిన కంపెనీలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చి రాగానే జే షాకు చెందిన ఓ కంపెనీకి రూ. 15 కోట్ల లోన్ మంజూరు అయింది. 2015లో సదరు కంపెనీ రూ. 80 కోట్ల టర్నోవర్ సాధించింది.
జే షాకే చెందిన మరో ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అప్పటికే బ్యాంకులకు రూ. 7 కోట్లు బాకీ పడి ఉన్నా.. గుజరాత్ కో ఆపరేటివ్ బ్యాంకు రూ.25 కోట్ల లోన్ను మంజూరు చేసింది. ఆ కంపెనీనే తర్వాత రిన్యూవబుల్ ఎనర్జీ కంపెనీగా మార్చారు. అనంతరం విద్యుత్ శాఖ నుంచి రూ. 10 కోట్ల రుణం పొందారు.