7 కోట్ల జాక్‌పాట్!

21 Sep, 2014 12:45 IST|Sakshi
7 కోట్ల జాక్‌పాట్!

కేబీసీ 8లో గెలుచుకున్న ఢిల్లీ సోదరులు
 
ముంబై: అచిన్ నరులా, సార్థక్ నరులా.. ఢిల్లీకి చెందిన ఈ అన్నదమ్ములిద్దరూ నిన్న మొన్నటి వరకూ చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా వీరిద్దరూ సెలబ్రిటీలైపోయారు.  కారణం ‘కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ)’ టీవీ షో. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కేబీసీ 8వ సీజన్ సోనీ టీవీలో ప్రసారమవుతుండడంతెలిసిందే. ఈ కార్యక్రమంలో తొలిసారి రూ. ఏడు కోట్ల ప్రైజ్ మనీని గెలుచుకుని నరూలా బ్రదర్స్ చరిత్ర సృష్టించారు. నాలుగు లైఫ్ లైన్ల సాయంలో 14 ప్రశ్నలనూ కరెక్ట్‌గా చెప్పి రికార్డు స్థాయి ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని అమితాబ్ తన బ్లాగ్, ట్విట్టర్‌లో వెల్లడించారు. విజేతలకు చెక్కును ఇస్తున్న ఫొటోను సైతం పోస్ట్ చేశారు. కేబీసీ ప్రారంభించిన తర్వాత ఈ స్థాయిలో ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నది వీరిద్దరే కావడం గమనార్హం.

అచిన్ ఢిల్లీలో మార్కెటింగ్ మేనేజర్. సార్థక్ ఓ విద్యార్థి. అచిన్ పదేళ్లుగా కేబీసీలో పాల్గొనేందుకు ప్రయత్నించి ఇప్పటికి సఫలమయ్యాడు. ‘‘ఈ రాత్రి ప్రపంచం తల్లకిందులైంది. ఇందుకు కేబీసీనే కారణం. అద్భుతమైన క్షణాలివి. ఏం మేథస్సు. ఎంత అద్భుతంగా ఆడారు. ఇది కేబీసీ వల్లే సాధ్యమైంది. నమ్మశక్యం కాని క్షణాలివీ’’ అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు బిగ్‌బీ.
 
 

మరిన్ని వార్తలు