జిన్నా ఫొటో.. 94 ఏళ్ల పూర్వ విద్యార్థి స్పందన

8 May, 2018 15:39 IST|Sakshi

అలీగఢ్‌ : మెహమ్మద్‌ అలీ జిన్నా ఫొటో వివాదంపై అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ పూర్వ విద్యార్థి ఒకరు స్పందించారు. 94 ఏళ్ల రియజ్‌-ఉర్‌-షర్వాణీ ఏఎంయూలోని జిన్నా వివాదంపై మాట్లాడుతూ.. యూనివర్సిటీ విద్యార్థి యూనియన్‌ హాల్‌లో ఉన్న ఫొటోలు విద్యార్థులకు సంబంధించిన విషయమని అందులో ఇతరులు తల దూర్చాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే జిన్నాను, ఆయన విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే వారిలో షర్వాణీ ముందు వరుసలో ఉంటారు. కానీ యూనివర్సిటీ జీవిత కాల సభ్యుడైన జిన్నా ఫొటోపై పూర్తి అధికారం విద్యార్థులదే అంటున్నారు. 1938లో జిన్నా యూనివర్సిటీ జీవిత కాల సభ్యత్వం పొందారు.

జిన్నా ఫొటోను యూనివర్సిటీలోని విద్యార్ధి యూనియన్‌ హాల్లో పెట్టినప్పుడు దేశంలో పరిస్థితులు వేరేలా ఉన్నాయని అన్నారు. యూనియన్‌ హాల్‌లో ఏం పెట్టాలనే విషయాన్ని బయటి వ్యక్తులు నిర్ణయించడం సరికాదని పేర్కొన్నారు. అప్పటి ప్రో వైస్‌ ఛాన్స్‌లర్‌ ఏబీ హబిబ్‌ యూనివర్సిటీలో జిన్నా చిత్రపటాన్ని ఆవిష్కరించారని, ఆ మీటింగ్‌కు ఆయన హాజరైనట్టు తెలిపారు. ఇది విద్యార్థుల వ్యక్తిగత విషయం అని అభిప్రాయపడ్డారు. 1938లో యూనియన్‌ నియమ నిబంధనలు వేరేగా ఉండేవని, అప్పటి విద్యార్ధి యూనియన్‌కు అధ్యక్షుడిగా ప్రో వైస్‌ ఛాన్స్‌లర్‌ ఉండేవారని అన్నారు. ఉపాధ్యక్షుడ్ని విద్యార్థులు ఎన్నుకునేవారని తెలిపారు. అప్పుడు జరిగిన అన్ని విషయాలు తనకు గుర్తులేకున్నప్పుటికి కొన్ని మాత్రం బాగా గుర్తున్నాయని అన్నారు.

జిన్నా ఎప్పుడు వర్సిటీకి వచ్చిన ఆయన ప్రసంగాలను వినేందుకు చాలా మంది ఆయన చుట్టు చేరేవారని, కానీ అందురూ ఆయన భావాలతో ఏకిభవించేవారు కాదని పేర్కొన్నారు. ఏఎంయూ నుంచి మాస్టర్స్‌ డిగ్రీ పొందిన షర్వాణీ, అదే వర్సిటీలో అరబిక్‌ ప్రొఫెసర్‌గా పని చేసి పదవి విరమణ పొందారు. ఈ వివాదంపై మరో పూర్వ విద్యార్థి 83 ఏళ్ల అమర్‌జిత్‌ సింగ్‌ బింద్రా స్పందిస్తూ.. జిన్నా చిత్రపటంపై కావలనే కొంతమంది రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. అప్పటి రోజులన్ని నాకు గుర్తున్నాయి. నిజం ఏంటంటే యూనియన్‌ హాలో చాలా మంది ఫొటోలు ఉన్నాయని అందులో జిన్నా ఫొటొ కూడా ఉందని అందులో తప్పేముందని అన్నారు. నేను దాన్ని చూస్తూ ఉండేవాడ్ని అన్ని అప్పటి రోజులను గుర్తుచేస్తుకున్నారు.

మరిన్ని వార్తలు