రోడ్డు ప్రమాద బాధితుడికి నష్టపరిహారం

4 Nov, 2014 22:36 IST|Sakshi

న్యూఢిల్లీ: డీటీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన బాధితుడికి రూ. 1.6 లక్షల నష్టపరిహారం చెల్లించాలని మోటార్ ప్రమాదాల ఫిర్యాదుల ట్రిబ్యునల్(ఎంఏసీటీ) ఆదేశించింది. డీటీసీ డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడిపి ప్రమాదానికి కారకుడు అయినట్లు పేర్కొంది. ఈ మేరకు బస్సు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉన్న ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీనీ సదరు వ్యక్తికి రూ. 1,60,900ల పరిహారాన్ని చెల్లించాలని సూచించింది.  2013లో డీటీసీ బస్సు ప్రమాదానికి గురైన రాజస్థాన్‌కు చెందిన సునిల్ చౌదరికి ఈ పరిహారాన్ని చెల్లించాలని ట్రిబ్యునల్ సూచించింది. డీటీసీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగంగా బస్సు నడపడం వల్లనే ప్రమాదానికి గురైనట్లు బాధితుడు సాక్షాధార పత్రాలను ట్రిబ్యునల్‌కు అందజేశాడని ఎంఏసీటీ నిర్వాహణాధికారి కేఎస్ మోహి చెప్పారు.
 
 ఎఫైఐఆర్ కాపీతోపాటు మెడికల్ రిపోర్టు పత్రాలను కూడా అందజేశాడు. డీటీసీ బస్సు నిబంధనలను ఉల్లంఘించలేదనడానికి అవసరమైన డాక్యుమెంట్లను ఇన్సూరెన్స్ కంపెనీకి చూపించలేదు. అంతేకాకుండా డ్రైవర్‌కు చెల్లుబాటు అయ్యే లెసైన్స్ కూడా లేదని బాధితుడు ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశాడు. దక్షిణ ఢిల్లీలోని టాటా మోటార్స్‌లో బాధితుడు సునీల్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆఫీసు సమీపంలో సెప్టెంబర్8-9, 2013లో నిలబడి ఉండగా డీటీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును నడపడంతో అతడిని డీకొట్టింది. ఈ క్రమంలో రోడ్డుపై పడి తీవ్రగాయాలపాలయ్యాడు. అతడిని సమీప ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. తలకు గాయాలైన అతడు వారం రోజులపాటు చికిత్స పొందాడు. సునిల్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాద జరిగిందని, డ్రైవర్ తప్పేమీ లేదని డీటీసీ ట్రిబ్యునల్ ఎదుట వాదించింది. దీంతో ఏకీభవించని కోర్టు బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
 

మరిన్ని వార్తలు