కోటా.. కొత్త కోణాలు

14 Jan, 2019 01:35 IST|Sakshi

ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లపై విశ్లేషణ...

రిజర్వేషన్‌ కేటగిరీలోకి రాని కులాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించాలన్న నరేంద్ర మోదీ ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున వాదోపవాదాలు సాగుతున్నాయి. ఈ నిర్ణయం అమలు ఆచరణ సాధ్యం కాదని కొందరంటుంటే, ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్‌ వ్యవస్థలో మార్పులకు ఇది దారితీస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారన్నది మొదటి నుంచీ అన్ని విపక్షాలూ ఆరోపిస్తున్నదే. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్‌ కల్పించాలని బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) సహా పలు రాజకీయ పార్టీలు, నాయకులు చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, కేంద్రం నిర్ణయం సమర్థనీయమా కాదా అన్నది చర్చనీయాంశమైంది.  
 – న్యూఢిల్లీ

ఓ కోణంలో సమర్థనీయమే..
సామాజికంగా ఉన్నతస్థానంలో ఉన్నవారి(అగ్రవర్ణాలు)లో ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనాలూ కల్పించరాదని ఎవరూ అనరు. కాబట్టి ఆ కోణంలో చూస్తే కేంద్రం నిర్ణయం సమర్థనీయ మేనని ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన సహాయ అధ్యాపకుడు అభినవ్‌ ప్రకాశ్‌సింగ్‌ అన్నారు. కేంద్రం కోటా ప్రకటిస్తే సరిపోదని, దాని ఫలితాలు లభించాలంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను కూడా భర్తీ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో వాటాపై వివిధ కులాల మధ్య జరిగే ఘర్షణను ఈ నిర్ణయం ఎంతవరకు పరిష్కరించ గలదన్నది కూడా ఆలోచించా లన్నారు. అగ్రవర్ణంలో పుట్టినప్పటికీ ఆర్థికంగా వెనకబడిన వ్యక్తి అన్ని విషయాల్లో ఇతర బలహీన వర్గాల వ్యక్తుల్లాగే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అయితే, దళితులు, ఇతర వెనకబడిన వర్గాల్లోని పేదలు అగ్రవర్ణ పేదలతో పోలిస్తే మరింత ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. దానికి కారణం వారు సామాజికంగా, సాంస్కృతికంగా కూడా వెనకబడి ఉండటం, వివక్షకు గురికావడం. కాబట్టి ఈ కోణంలో చూస్తే అగ్రవర్ణ పేదలను, ఓబీసీ పేదలను ఒకే గాటన కట్టడం ఎంత వరకు సమర్థనీయమని రాజ్యాంగ నిపుణులు వేస్తున్న ప్రశ్న.

అన్నింటికీ క్రీమీలేయర్‌ వర్తింప చేయాలి..
తాజా కోటాకు సంబంధించిన కుటుంబ ఆదాయం, సాగుభూమి ఆధారంగా ఆర్థిక వెనక బాటును నిర్ణయించనున్నట్టు పేదల బిల్లు ప్రతి పాదించింది. అయితే, ఈ ప్రాతిపదిక అగ్ర వర్ణాలకేనా లేక అన్ని వర్ణాలకీ వర్తిస్తుందా అన్నది బిల్లులో స్పష్టం చేయలేదు. కుల, మతాలకతీ తంగా ఆర్థికంగా వెనుక బడినవారికి రిజ ర్వేషన్‌ కల్పిస్తు న్నట్టు మాత్రమే పేర్కొంది. దీనివల్ల అగ్రవర్ణ పేదలు కూడా దీని పరిధిలోకి వస్తారు. అదే జరిగితే రిజర్వేషన్లు మూడు రకాలుగా తయారవుతాయి. కేవలం గుర్తింపు ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్లు అంటే ఎస్సీ, ఎస్టీలు ఒక రకం. కులం, ఆర్థిక స్తోమత ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్లు రెండో రకం. ఓబీసీ/ఈబీసీలు ఈ కోవలోకి వస్తారు. మూడోది కులంతో సంబంధం లేకుండా కేవలం ఆర్థిక ప్రాతిపదికపైనే ఇచ్చే రిజర్వేషన్లు. ఈ మూడు రకాల రిజర్వేషన్లకు సంబంధించి వివా దాలు తలెత్తే అవకాశం ఉంది. ఓబీసీ రిజర్వేషన్లలో కుల ప్రాతిపదికన తొలగించాలని, ఆర్థిక స్తోమతనే ప్రాతిపదికగా తీసుకోవాలని ఇప్పటికే పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ఒకవేళ దీనిని అమలు చేస్తే, ఎస్సీ, ఎస్టీలు మినహా మిగిలిన అన్ని కులాలకూ ఒకే కోటా ఉంటుంది. ప్రస్తుత ఓబీసీ, ప్రతిపాదిత ఈబీసీ కోటాను కలిపేసి ఎస్సీ, ఎస్టీలు మినహా మిగిలిన అన్ని కులాలకూ క్రీమీలేయర్‌ వర్తింపజేసి, పేదలకు ఈ కొత్త కోటాలోనే రిజర్వేషన్‌ కల్పించాలనేది వారి డిమాండ్‌. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలోనూ క్రీమీలేయర్‌ విధానాన్ని ప్రవేశపెట్టి, అసలైన పేదలకే రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్‌ కూడా ఎప్పటినుంచో ఉంది

ఉద్యోగాలు భర్తీ చేయాలి
ప్రస్తుతానికయితే కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న అగ్రవర్ణాల కోపాన్ని కొంతమేర తగ్గించవచ్చు. రిజర్వేషన్లపై వారి అభిప్రాయాన్ని మార్చుకునేందుకు వీలు కల్పిస్తుంది. కేంద్రం తాజా నిర్ణయంపై వారిలో వ్యతిరేకత వ్యక్తం కాకపోవడం, ఇది మెరిట్‌ను చంపేస్తుందంటూ రోడ్డెక్కకపోవడమే దీనికి నిదర్శనం. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో తమ వాటాపై వివిధ కులాల మధ్య తలెత్తుతున్న ఘర్షణలను ఈ పేదల కోటా ఏ మేరకు పరిష్కరి స్తుందన్నది వారి అనుమానం. దశాబ్దాల తరబడి ఖాళీగా ఉంటున్న ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వం ఈ ఘర్షణను నివారించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గి పోతుండటం, నియామక ప్రక్రియ నిలిచిపోవ డం వల్ల యువజనుల్లో తలెత్తిన అసంతృప్తిని ఉద్యోగాల భర్తీ ద్వారా తొలగించడమన్నది ఈ ఎన్నికల సంవత్స రంలో ప్రభుత్వ తక్షణ ప్రాధాన్యం కావాలని ప్రొఫెసర్‌ అభినవ్‌ ప్రకాశ్‌సింగ్‌ సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు