వాళ్లు తెరవెనుక హీరోలు : ఆనంద్‌ మహీంద్రా

2 Jul, 2019 17:04 IST|Sakshi

ముంబై : గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ముంబై మహానగరాన్ని ముంచెత్తిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం కూడా భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. రోడ్డు, రైలు సేవలతో పాటు విమాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇలాంటి సమయంలో మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ముంబైలో ఇంతటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ పేపర్‌ బాయ్స్‌ తెరవెనుక నిజమైన హీరోలుగా నిలిచారని ఆయన అన్నారు. వారికి సెల్యూట్‌ చేస్తూ ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. 

‘ముంబై ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేను మూసివేశారు. స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రైలు పట్టాలపైకి పూర్తిగా నీరు చేరింది. కానీ న్యూస్‌ పేపర్‌ మాత్రం రోజు వచ్చే సమయానికే మా ఇంటికి వచ్చింది. అది కూడా పొడిగా(ఏ మాత్రం తడవకుండా). ఇందుకు కారణం తెరవెనుక ఉన్న నిజమైన హీరోలు. కుండపోత వర్షం కురుస్తున్నప్పటికీ.. మనల్ని సాధారణ రోజులుగా అనుభూతికి గురిచేసిన వారికి సెల్యూట్‌ చేస్తున్నట్టు’ ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. అలాగే తన ఇంటికి వచ్చిన న్యూస్‌ పేపర్‌ను పోస్ట్‌ చేశారు.  అయితే ఈ ట్వీట్‌ కొద్ది సేపటికే వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. న్యూస్‌ పేపర్‌ బాయ్స్‌, మిల్క్‌ మ్యాన్‌, కూరగాయల అమ్మేవారు నిజమైన హీరోలు అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు