'ఫలితం ఏదైనా చివరి వరకు పోరాడు'

16 Nov, 2019 10:51 IST|Sakshi

న్యూఢిల్లీ : ఆనంద్‌ మహీంద్ర.. ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు ఇది.. ప్రముఖ వ్యాపారవేత్త. నిత్యం వ్యాపార లావాదేవీలతో తలమునకలయ్యే ఈయన అప్పుడప్పుడు సోషల్ మీడియాపైనా ఓ కన్నేస్తుంటారు. ఈయనకు సినీ హీరోల రేంజ్‌లో సోషల్‌మీడియాలో కూడా లక్షల్లో అభిమానగణం ఉంది. ఆయన ఎప్పుడూ సోషల్‌ మీడియాలో సమకాలీన అంశాలపై ఎప్పుడూ స్పందిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆయన ట్వీట్‌ చేసిన ఓ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆటలో అయినా జీవితంలో అయినా ఆఖరి నిమిషం వరకు పోరాడితే ఫలితం ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా తెలుస్తుంది అంటూ ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ చేశారు. ఈ వీడియో ఓ కబడ్డీ మ్యాచ్‌కు సంబంధించినది.

కూతకు వెళ్లిన ఓ ఆటగాడు ప్రత్యర్థి జట్టు ఆటగాడ్ని అవుట్ చేసి లైన్ వద్దకు చేరుకుంటాడు. అయితే తన కోర్టులోకి వెళ్లకుండా ఇంకా అక్కడే ఉండి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను రెచ్చగొడతాడు. ఇంతలో అవుటైన ఆటగాడు అక్కడికి వచ్చి కవ్విస్తున్న ఆ రైడర్‌ను ఒక్కసారిగా తమ కోర్టు లోపలికి లాగడంతో అందరూ వచ్చి మూకుమ్మడిగా అతడ్ని పట్టుకోవడం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో చూసిన ఆనంద్ మహీంద్ర.. ప్రొకబడ్డీ లీగ్‌లో ఇలాంటి సీన్ చూడలేదంటూ కామెంట్ చేశారు. ఏదైనా చివరి వరకు పోరాడు అనే సందేశాన్ని ఇచ్చారు మహీంద్ర. పాయింట్ వచ్చేందుకు ఎలాంటి ఆస్కారం లేకపోగా, ప్రత్యర్థికి ఓ పాయింట్ కోల్పోయిన స్థితిలో కూడా పోరాటపటిమ ఉంటే ఎలాంటి ఫలితమైనా వస్తుందని సదరు ఆటగాడు నిరూపించాడు.
 

మరిన్ని వార్తలు