‘దారుణమైన వర్కవుట్లు; కాబట్టే సింధూ గెలిచింది’

28 Aug, 2019 12:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహింద్ర గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహింద్రా బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధూపై చేసిన ట్వీట్‌ వైరల్‌ అయింది. సింధూ వర్కవుట్‌ చేస్తున్న వీడియోను షేర్‌ చేసిన ఆయన.. ‘పీవీ సింధూ బ్యాడ్మింటన్‌లో వరల్డ్‌ చాంపియన్‌గా నిలవడంలో రహస్యమేముంది. ఆమె చేస్తున్న దారుణమైన వర్కవుట్లు చూసి మతిపోయింది. అంతలా కష్టపడుతోంది కాబట్టే ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. యావత్‌ భారతంలోని యువ క్రీడాకారులు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. ఆమెలా కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరాలి’ అని ట్వీట్‌ చేశారు. సింధూ వర్కవుట్‌కు సంబంధించిన ఈ వీడియో  ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు బయల్దేరే ముందు హైదరాబాద్‌లోని సుచిత్ర బ్యాడ్మింటన్‌ అకాడెమీలోనిది.
(చదవండి : సింధు స్వర్ణ ప్రపంచం)

ఆదివారం జరిగిన ప్రపంచ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ (బీడబ్ల్యూఎఫ్‌) మహిళల సింగిల్స్‌ ఫైనల్లో పీవీ సింధు అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఐదో ర్యాంకర్‌ సింధు కేవలం 38 నిమిషాల్లో 21–7, 21–7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, 2017 ప్రపంచ చాంపియన్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌)పై జయకేతనం ఎగరేసింది. బీడబ్ల్యూఎఫ్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు కొత్త చరిత్ర లిఖించింది. ఈ విజయంతో 42 ఏళ్ల ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో అత్యధిక పతకాలు గెలిచిన ప్లేయర్‌గా చైనా క్రీడాకారిణి జాంగ్‌ నింగ్‌ (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పేరిట ఉన్న రికార్డును సింధు (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) సమం చేసింది.

మరిన్ని వార్తలు