ఆంధ్రా చేపలు తినొచ్చు

19 Jul, 2018 12:52 IST|Sakshi
రాష్ట్ర మత్స్య, పశు అభివృద్ధి శాఖ డైరెక్టర్‌ ప్రశాంత సేనాపతి

చేపల్లో ప్రాణాంతక ఫార్మాలిన్‌ లేదు

రాష్ట్ర మత్స్య, పశు అభివృద్ధి శాఖ డైరెక్టర్‌ ప్రశాంత సేనాపతి

భువనేశ్వర్‌ (ఒరిస్సా) : రాష్ట్రంలో ప్రజలు చేపల్ని నిర్భయంగా తినవచ్చు. రాష్ట్రంలో విక్రయిస్తున్న చేపల్లో విషపూరిత ఫార్మాలిన్‌ ప్రయోగం లేనట్టు పరీక్షల్లో తేలింది. సముద్రం, చెరువు, ఏరుల్లో లభించిన చేపల్లో ఎటువంటి అపాయకర ప్రయోగం లేనట్టు ఈ పరీక్షలు స్పష్టం చేశాయని రాష్ట్ర మత్స్య, పశు అభివృద్ధి శాఖ డైరెక్టర్‌ ప్రశాంత సేనాపతి తెలిపారు. చెరువు చేప, సముద్రపు చేప అయినా నిర్భయంగా తినవచ్చని బుధవారం ప్రకటించారు. 

నిరవధికంగా మెరుపు దాడులు 

రాష్ట్రవ్యాప్తంగా చేపల మార్కెట్లు, గోదాంలపై మెరుపు దాడులు నిర్వహించడం నిరవధికంగా సాగుతుంటుందని ఆయన స్పష్టం చేయడం విశేషం. జిల్లా కలెక్టర్లు చేపల నమూనాల్ని సేకరించి పరీక్షల కోసం పరీక్షా కేంద్రాలకు తరలిస్తారు. కటక్, బరంపురం, రౌర్కెలా ప్రాంతాల్లో బుధవారం చేపల మార్కెట్లపై ఇటువంటి దాడులు చేపట్టి నమూనాల్ని సేకరించి పరీక్షల కోసం సిఫారసు చేసినట్టు వివరించారు.

రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్‌ రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల కలెక్టర్లతో పాటు 5 మున్సిపల్‌ కార్పొరేషన్లకు చేపల పరీక్షల కోసం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అనుబంధ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ పరీక్షలు నిర్వహించాలని ఆహార భద్రత కమిషనర్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు