ఆగిపోయిందని రోడ్డు మీదే తగలబెట్టాడు

3 Sep, 2019 21:55 IST|Sakshi

రాజ్‌కోట్‌ : మనం​ ఒక పని మీద ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మన వాహనం మధ్యలో ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది. వెంటనే దగ్గర్లోని మెకానిక్‌ దగ్గరికి తీసుకెళ్లి రిపేర్‌ చేయిస్తాం అంతేకానీ ఉన్నపళంగా ఆగిపోయిన ప్రదేశంలో దాన్ని తగలబెట్టేయం కదా. కానీ ఓ వ్యక్తి తన జీపు రోడ్డు మధ్యలో ఆగిపోవడంతో కోపం వచ్చి దానిని అక్కడే తగలబెట్టేశాడు. ఈ వింత ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఇంద్రజిత్‌ సింగ్‌ అనే వ్యక్తి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో నివసిస్తున్నాడు. అయితే పని మీద ఇంద్రజిత్‌ తన జీపులో బయల్దేరాడు. సగం దూరం రాగానే జీపు రోడ్డు మీద ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా జీపు స్టార్ట్‌ కాకపోవడంతో విసుగెత్తి అందరూ చూస్తుండగానే జీపుపై పెట్రోల్‌ పోసీ తగులబెట్టాడు. ఈ మొత్తం ఘటనను అతని స్నేహితుడు వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు మధ్యలో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడమే గాక ప్రభుత్వ ఆస్తులకు భంగం కలిగించినందుకు వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాజ్‌కోట్‌ ఎస్పీ ఏఎన్‌ రాథోడ్‌ మాట్లాడుతూ.. జీపు బ్యాటరీ పాడవడంతో ఇంద్రజిత్‌కు క్షణికావేశంతో తన జీపును తగులబెట్టాడని, దీనికి సంబంధించి కేసు ఇప్పటికే నమోదు చేశామని తెలిపారు. దీనిపై  పూర్తి స్థాయి విచారణ కొనసాగిస్తామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు