‘వ్యాపమ్’ నిందితుల మరణాలపై మధ్యప్రదేశ్ హోం మంత్రి
భోపాల్: ‘పుట్టినవాడు గిట్టక మానడు..మరణం అనేది సహజం.. అది జైల్లో అయినా.. రైల్లో అయినా.. ఒకసారి పుడితే చనిపోక తప్పదు’.. మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబూలాల్ గౌర్ అన్న మాటలివి. సంచలనం సృష్టించిన ఆ రాష్ట్ర వృత్తి పరీక్షల బోర్డు(ఎంపీపీఈబీ) అలియాస్ వ్యాపమ్ స్కాం నిందితులు ఒకరి తరువాత ఒకరు చనిపోవటంపై మంత్రి చేసిన వ్యాఖ్యలివి. ఈ స్కాంలో ఇద్దరు నిందితులు 24 గంటల వ్యవధిలో చనిపోవటంపై సీబీఐ విచారణ జరిపించటానికి సోమవారం ఆయన తిరస్కరించారు.
తమ విచారణ సరైన దిశలోనే సాగుతోందన్నారు. వ్యాపమ్ కేసులకు సంబంధించి దాదాపు వందమంది నిందితులలో 25మంది చనిపోయారు.
‘మద్యపానం ప్రాథమిక హక్కు..’: మద్యపానం ప్రాథమిక హక్కు, సామాజిక హోదాకు చిహ్నమని బాబూలాల్ గౌర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యంతో నేరాలు పెరగవన్నారు. భోపాల్లో మద్యం అమ్మకాల సమయాన్ని రాత్రి 11.30కు పొడిగించడంపై ఆయనిలా స్పందించారు.