మరో భారీ కుంభకోణం

19 Feb, 2018 03:29 IST|Sakshi
విక్రమ్‌ కొఠారీ

రూ. 800 కోట్లకు బ్యాంకుల్ని ముంచి విక్రమ్‌ కొఠారీ పరారు!

ఎక్కడికీ పారిపోలేదు: రొటొమ్యాక్‌

పెన్స్‌ యజమాని కొఠారీ

న్యూఢిల్లీ/కాన్పూర్‌: వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ షాక్‌ నుంచి ఇంకా తేరుకోకముందే.. కాన్పూర్‌కు చెందిన వ్యాపార వేత్త విక్రమ్‌ కొఠారీ రూ. 800 కోట్ల మేర బ్యాంకుల్ని ముంచేసి విదేశాలకు పరారయ్యారన్న వార్త కలకలం రేపుతోంది. రొటొమ్యాక్‌ పెన్స్‌ కంపెనీ యజమాని కొఠారీ.. అలహాబాద్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాల నుంచి తీసుకున్న రూ. 800 కోట్ల రుణాల్ని ఎగ్గొటారని, ఈ రుణాల మంజూరులో బ్యాంకులు కూడా రాజీపడ్డాయని కథనాలు వెలువడ్డాయి.

ఒక నివేదిక ప్రకారం ముంబైలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి రూ. 485 కోట్లు, కోల్‌కతాలోని అలహాబాద్‌ బ్యాంకు నుంచి రూ. 352 కోట్లను కొఠారీ రుణంగా తీసుకున్నారని.. ఏడాది గడిచినా వడ్డీ గానీ రుణం గానీ కొఠారీ చెల్లించనట్లు తెలుస్తోంది.  కాన్పూర్‌ నడిబొడ్డున ఉన్న కొఠారీ కంపెనీ ప్రధాన కార్యాలయం వారం నుంచి మూసేఉందని.. ఆయన జాడ కూడా తెలియడం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే తాను పారిపోయానంటూ వస్తున్న వార్తలు ఊహాగానాలేనని కొఠారీ చెప్పినట్లు స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి.

‘నేను కాన్పూర్‌ వాసిని.. ఇక్కడే ఉంటాను. వ్యాపార అవసరాల కోసం అవసరమైనప్పుడు విదేశాలకు వెళ్లి వస్తుంటా’ అని కొఠారీ పేర్కొన్నారు. మరోవైపు అలహాబాద్‌ బ్యాంకు మేనేజరు రాజేశ్‌ గుప్తా మాట్లాడుతూ.. కొఠారీ ఆస్తుల్ని అమ్మడం ద్వారా డబ్బును రాబట్టుకోగలమనే నమ్మకం ఉందన్నారు. గతేడాది బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. రొటొమ్యాక్‌ గ్లోబల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారు’(విల్‌పుల్‌ డిఫాల్టర్‌)గా ప్రకటించింది.

తమను ‘విల్‌ఫుల్‌ డిఫాల్టర్‌’ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఆ కంపెనీ అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించింది. రూ. 300 కోట్లకు పైగా ఆస్తుల్ని ఇచ్చేందుకు సిద్ధమైనా రోటొమ్యాక్‌ను ‘విల్‌ఫుల్‌ డిఫాల్టర్‌’గా తప్పుగా ప్రకటించారని అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీబీ భోస్లే, జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ధర్మాసనం పేర్కొంది. రిజర్వ్‌ బ్యాంకు నిర్దేశించిన ప్రమాణాల మేరకు రొటొమ్యాక్‌ను విల్‌ఫుల్‌ డిఫాల్టర్‌గా ప్రకటిస్తూ ఫిబ్రవరి 27, 2017న ఆదేశాలు జారీ అయ్యాయి.  

>
మరిన్ని వార్తలు