మరో రూ. 5 కోట్లు 

20 Aug, 2018 15:19 IST|Sakshi
నవీన్‌ పట్నాయక్‌

కేరళ వరద బాధితులకు అదనపు సాయం

ముఖ్యమంత్రి నవీన్‌  పట్నాయక్‌ ప్రకటన 

భువనేశ్వర్‌ : కేరళ వరద బాధితులకు  ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆదివారం అదనపు ఆర్థిక సహాయం ప్రకటించారు. తాజాగా రూ. 5 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ నెల 16వ తేదీన కేరళ వరద బాధితులకు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన విషయం తెలిసిందే. తాజా ఆర్థిక సహాయంతో పాటు రూ. 8 కోట్లు విలువ చేసే 500 మెట్రిక్‌ టన్నుల పాలిథిన్‌ షీట్లని కూడా పంపిణీ చేసినట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వరద బాధితుల సహాయక చర్యల కోసం 65 పడవలతో 244 మంది అగ్ని మాపక దళాల్ని కేరళ రాష్ట్రానికి తరలించారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకుల పట్ల ముఖ్యమంత్రి సానుభూతి ప్రకటించారు.

ఈ శతాబ్దంలో అతి భయంకరమైన ప్రకృతి విపత్తుతో కేరళ విలవిలలాడుతోంది. ఇది అత్యంత విచారకర పరిస్థితిగా ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి విపత్తును చవిచూసిన ఒడిశా రాష్ట్ర ప్రజలకు కేరళ బాధితుల మనో వేదన ఏమిటో ఇట్టే అంతు చిక్కుతుందన్నారు. వీరి ఆవేదనతో రాష్ట్రం యావత్తు దన్నుగా నిలుస్తుందని ముఖ్యమంత్రి అభయం ఇచ్చారు. కేరళ వరద సహాయక చర్యల నేపథ్యంలో అనుక్షణం అందుబాటులో ఉంటూ తాజా స్థితిగతుల్ని సమీక్షించి చేయూతగా వ్యవహరించాలని రాష్ట్ర సహాయ కమిషనర్‌కు ముఖ్యమంత్రి ఆదేశించడం విశేషం. అలాగే కేరళ వరదల్లో చిక్కుకున్న ఒడిశా కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక బృందాన్ని ప్రభావిత ప్రాంతాలకు పంపించింది. 

మరిన్ని వార్తలు