చండీగఢ్: పంజాబ్లో మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను తాను చూశానని మరో ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. మిలటరీ స్థావరం గురించి వారు వాకబు చేసినట్టు టిబ్రికి చెందిన లవ్ప్రీత్ సింగ్ అనే యువకుడు చెప్పాడు. ఆర్మీ, పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. టిబ్రికి సమీపంలో మిలటరీ స్థావరముంది.
గురువారం తాను బైకులో వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆపి, మిలటరీ స్థావరం గురించి అడిగారని లవ్ప్రీత్ సింగ్ తెలిపాడు. వారిద్దరూ సైనిక దుస్తుల్లో ఉన్నారని, ఆయుధాలున్నాయని వెల్లడించాడు. వారి భాష సరిగా అర్థంకాలేదని వివరించాడు. వారిద్దరిని చూసి భయపడ్డానని, పారిపోయేందుకు ప్రయత్నించగా ఒకతను తన భుజంపై చేయి వేసి పట్టుకున్నాడని చెప్పాడు. అనంతరం పోలీసులు లవ్ప్రీత్ సింగ్ను ఆ ప్రాంతానికి తీసుకెళ్లి విచారించారు. ఇంతకుముందు పాందేర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు.. తాము చెరుకుతోటలో ఇద్దరు అనుమానాస్పద ఉగ్రవాదులను చూసినట్టు చెప్పారు. ఉగ్రవాదులు ఇటీవల పఠాన్కోట్లోని ఎయిర్బేస్పై దాడి చేసిన సంగతి తెలిసిందే.