'తెలుగులో చదువుకున్నవాళ్లకు నష్టం'

5 May, 2016 17:09 IST|Sakshi
'తెలుగులో చదువుకున్నవాళ్లకు నష్టం'

'నీట్' పై సుప్రీంకోర్టులో ఏపీ, తెలంగాణ వాదనలు

న్యూఢిల్లీ: నీట్పై సుప్రీంకోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. ఏపీ, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలు తమ తమ వాదనలను వినిపించాయి. ఈ ఏడాది ఈ పరీక్ష నుంచి తమ విద్యార్థులకు మినహాయింపు ఇవ్వాలని సదరు మూడు రాష్ట్రాలు సుప్రీంకోర్టును కోరాయి. నీట్కు సిద్ధమయ్యేందుకు విద్యార్థుల వద్ద పుస్తకాలు లేవని ఏపీ, తెలంగాణ వాదించాయి. స్పల్పకాలంలో సీబీఎస్ఈ పుస్తకాలు అందుబాటులోకి తేవడం అసాధ్యమని... గతంలో ఏపీ, జమ్ముకాశ్మీర్లను నీట్ నుంచి మినహాయించారని, దీనికి రాజ్యాంగపరమైన రక్షణలు ఉన్నాయని ఏపీ, తెలంగాణ ఈ సందర్భంగా పేర్కొన్నాయి. సీబీఎస్ఈ సిలబస్ వల్ల తెలుగు విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని ఏపీ, తెలంగాణ తరఫున వాదనలు వినిపించిన పీపీ రావు, బసవప్రభు పాటిల్ చెప్పారు. భాషా పరమైన సమస్యలు ఉన్నాయని ఈ సందర్భంగా గుజరాత్ తన వాదనలు వినిపించింది. కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదలాయించాలని కపిల్ సిబాల్ వాదించారు.

371 (డి)కి ఈ తీర్పు విఘాతం కల్గిస్తోందని ఆంధ్రప్రదేశ్ తన వాదనలు వినిపించింది. తమ విద్యార్థులకు రాజ్యాంగపరంగా రక్షణ ఉందని పేర్కొంది. తెలుగులో చదువుకున్న విద్యార్థులకు నీట్ వల్ల నష్టం కలుగుతుందని అభిప్రాయపడింది. సీబీఎస్ఈ సిలబస్ పుస్తకాలు తెలుగులో ఇప్పటికిప్పుడు లభ్యం కావడం కష్టమని అభిప్రాయపడింది. నీట్ తీర్పు వల్ల జోనల్ వ్యవస్థకు కూడా విఘాతమే అని ఏపీ పేర్కొంది. ఏపీ ప్రస్తావించిన అంశాలనే తెలంగాణ కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. పునర్విభజన చట్టం, ఆర్టికల్371 డీ, తెలుగు మీడియం విద్యార్థుల సమస్యలను తెలంగాణ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఈ ఏడాదికి నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని సుప్రీంకోర్టును తెలంగాణ కోరింది.

>
మరిన్ని వార్తలు