హైకోర్టు జడ్జీలుగా నియమించలేం

25 Jun, 2018 03:05 IST|Sakshi

కొలీజియం సిఫారసులను రెండోసారి తిరస్కరించిన కేంద్రం  

న్యూఢిల్లీ: అలహాబాద్‌ హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్న ఇద్దరికి అదే హైకోర్టులో న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను కేంద్రం రెండోసారి కూడా వెనక్కు పంపింది. కొలీజియం సిఫారసు చేసిన న్యాయవాదులపై ఫిర్యాదులు ఉన్నందున వారిని జడ్జీలుగా నియమించలేమని కేంద్రం పేర్కొంది. ఆ ఇద్దరు న్యాయవాదుల్లో ఒకరైన మహ్మద్‌ మన్సూర్‌.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి దివంగత సాఘిర్‌ అహ్మద్‌ కుమారుడు కావడం గమనార్హం.

న్యాయవాదులు మహ్మద్‌ మన్సూర్‌తోపాటు బష్రత్‌ అలీని అలహాబాద్‌ హైకోర్టులో న్యాయమూర్తులుగా నియమించాలంటూ చాలా రోజుల క్రితమే సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఆ ఇద్దరిపై ఫిర్యాదులున్నాయన్న కారణం చూపుతూ అప్పట్లో కేంద్రం ఈ ప్రతిపాదనను తిప్పిపంపింది. ఆ ఫిర్యాదులు తీవ్రమైనవేమీ కాదంటూ కొలీజియం మరోసారి అవే పేర్లను సిఫారసు చేయగా, ఏ నిర్ణయమూ తీసుకోకుండా రెండున్నరేళ్లు కాలయాపన చేసిన ప్రభుత్వం ఎట్టకేలకు వారిరువురీ పేర్లను తిరస్కరిస్తున్నట్లు గత నెలలో కొలీజియంకు తెలిపింది. కొలీజియం సభ్యుల్లో ఒకరైన జస్టిస్‌ చలమేశ్వర్‌ ఇటీవలే పదవీ విరమణ పొందినందున కొత్త కొలీజియం ఏర్పాటైన అనంతరం ఈ అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది. 

మరిన్ని వార్తలు