హైవేలపై పెరిగిన టోల్‌ ఫీజు

1 Apr, 2018 02:25 IST|Sakshi

ఆగ్రా: జాతీయ రహదారులపై ప్రయాణం మరింత భారంగా మారింది. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై టోల్‌ రేట్లను 5 నుంచి 7శాతం పెంచుతూ జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) నిర్ణయం తీసుకుంది. అత్యవసర వస్తువుల రవాణా వాహనాలకూ ఇది వర్తిస్తుంది. జాతీయ రహదారి–2 ప్రాజెక్టు డైరెక్టర్‌ మహ్మద్‌ షఫీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘జాతీయరహదారులపై 372 టోల్‌ప్లాజాలున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టోల్‌ రేట్లను టోకు ధరల సూచీ ప్రాతిపదికగా సవరిస్తుంది.

దీంతో ఒకే ప్రాంతంలోని టోల్‌ప్లాజాల వద్ద వసూలు చేసే ఫీజులు ఒకేలా ఉండవు. ఎన్‌హెచ్‌–2పై టోల్‌ రేట్లలో 5శాతం పెరుగుదల ఉంటుంది’అని షఫీ తెలిపారు. ఎక్కువ శాతం టోల్‌ప్లాజాల వద్ద ఇదే పెరుగుదల ఉంటుందని ఆయన తెలిపారు. నెలవారీ పాస్‌లున్న వాహనాలకూ ఇదే వర్తిస్తుంది. టోల్‌ రేట్ల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయని వాహనయజమానులు అంటున్నారు. ఎన్‌హెచ్‌–1, 2లు అధ్వానంగా ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం టోల్‌ ఫీజు  పెంచిందని విమర్శిస్తున్నారు.

మరిన్ని వార్తలు