‘దళితులతో బీజేపీ నాయకులు పెళ్లిళ్లకు సిద్ధమా?’

7 Jul, 2017 20:08 IST|Sakshi
‘దళితులతో బీజేపీ నాయకులు పెళ్లిళ్లకు సిద్ధమా?’

బెంగళూరు: దళితులపై బీజేపీ నాయకులకు నిజంగా ప్రేమ ఉంటే హోటల్‌ నుంచి తెప్పించుకున్న ఆహారాన్ని దళితుల ఇళ్లల్లో తింటున్నట్లు నటించడం కాదు, దళితులతో వైవాహిక బంధం పెంచుకోవాలని సీఎం సిద్ధరామయ్య బీజేపీ నాయకులకు సవాల్‌ విసిరారు. దళిత యువకులకు వారి ఇంటి అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేయాలని, అలాగే దళిత యువతులను బీజేపీ నేతల కుటుంబాల్లోకి కోడళ్లుగా చేసుకోవాలని సూచించారు. శుక్రవారం కిత్తగనూరులో 65 ఎంఎల్‌డీ సామర్థం కలిగిన నీటి శుద్ధీకరణ కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

దళితులను కేవలం ఓటర్లుగానే పరిగణిస్తున్న బీజేపీ నేతలు ఓట్ల కోసమే వారి ఇళ్లల్లో భోజనాలు చేస్తూ కపట నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నాటకాలను ప్రజలు పసిగట్టడంతో ఇక అధికారంలోకి రావడం కష్టమని భావించి గతంలో రాష్ట్రంలో 150 స్థానాల్లో గెలుస్తామంటూ ప్రగల్భాలు పలికిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ఈ మధ్యకాలంలో 150 స్థానాల్లో గెలుపు గురించి ఎక్కడా మాట్లాడడం లేదన్నారు. మురికివాడల వాసుల తాగునీటి కోసం రోజూ పది లక్షల లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు