సరిహద్దు శిబిరాలకు ఆర్మీ చీఫ్‌

31 Aug, 2019 04:21 IST|Sakshi
సైనికులతో మాట్లాడుతున్న జనరల్‌ రావత్‌

370 రద్దు తరవాత తొలిసారి కశ్మీర్‌కు జనరల్‌ రావత్‌

కమాండర్లతో సమావేశం.. బలగాల సన్నద్ధతపై సమీక్ష   

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దు అనంతరం పాక్‌తో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు, ఆ దేశ నాయకుల రెచ్చగొట్టే ప్రకటనల నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమయింది. ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం శ్రీనగర్‌కు చేరుకున్నారు. నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి సైనిక పోస్టులను సందర్శించారు. బలగాల కార్యాచరణ సన్నద్ధత, ముఖ్యంగా ఎల్‌వోసీ వెంట వాస్తవ పరిస్థితులపై సైనిక కమాండర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాదామీబాగ్‌లోని ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశంలో రాష్ట్రంలో అంతర్గత పరిస్థితులపైనా ఆయన సమీక్షించనున్నారు.

కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం ఆర్మీ చీఫ్‌ రాష్ట్రంలో పర్యటించడం ఇదే ప్రథమం.  ఇలా ఉండగా, కశ్మీర్‌ లోయతోపాటు శ్రీనగర్‌లో శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా నిషేధాజ్ఞలు విధించారు. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు.  మలయాళ మనోరమ న్యూస్‌ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడారు.
 

>
మరిన్ని వార్తలు