ఇమ్రాన్‌ వ్యాఖ్యలకు ఆర్మీ చీఫ్‌ కౌంటర్‌

25 Jul, 2019 15:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి భారత్‌ ఇంటి పనేనని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ దీటుగా తిప్పికొట్టారు. పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్‌ పాత్రపై భారత్‌ పూర్తి ఆధారాలను పాక్‌కు ఇచ్చిందని చెప్పారు. భారత నిఘా సంస్ధలు పుల్వామాలో ఏం జరిగిందనేది ఆధారాలతో సహా అందించాయని..ఇంతకంటే తాను ఏమీ చెప్పలేనని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా ఇమ్రాన్‌ ఖాన్‌ ఇటీవల తన అమెరికా పర్యటన సందర్భంగా  పుల్వామా దాడిలో పాకిస్తాన్‌ పాత్ర లేదని, భారత భద్రతా దళాల వేధింపులతో విసుగుచెందిన ఓ కశ్మీరీ యువకుడు ఈ ఘాతుకానికి తెగబడగా, అనూహ్యంగా పాకిస్తాన్‌ పేరును తెరపైకి తెచ్చారని వ్యాఖ్యానించారు. జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థ పాకిస్తాన్‌లో ఉన్నా కశ్మీర్‌లోనూ దాని ఉనికి ఉందని, పుల్వామా దాడి భారత్‌లో జరిగిన దేశీయ దాడిగా ఇమ్రాన్‌ చెప్పుకొచ్చారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికిపైగా సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది మురణించిన సంగతి తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో మెరుపు దాడులు చేపట్టి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది.

మరిన్ని వార్తలు