సాక్షి, న్యూఢిల్లీ : ఆధునిక యుద్ధ తంత్రాల్లో సోషల్ మీడియా పాత్రను విస్మరించలేమని, సైనికులు వారి కుటుంబాలను స్మార్ట్ ఫోన్లు ఉపయోగించకుండా ఎవరూ ఆపలేరని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండాలని సైనికులను కోరాలని తమకు సూచనలు వచ్చాయని, స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండాలని సైనికులు, వారి కుటుంబాలను కోరగలమా అని ఆయన ప్రశ్నించారు.
స్మార్ట్ ఫోన్ను అనుమతిస్తూనే క్రమశిక్షణను తీసుకురాగలగడం ముఖ్యమని ఆర్మీ చీఫ్ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాను విస్మరించలేమని, సైనికులు దీన్ని వాడుకుంటారని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాను సైనికులు అవకాశంగా మలుచుకోవాలని రావత్ సూచించారు. ఆధునిక కదనరంగంలో కృత్రిమ మేథను అందిపుచ్చుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ సోషల్ మీడియా ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అందిపుచ్చుకునే ఆలోచన చేయాలని కోరారు.