కశ్మీర్‌ పోలీసులకు ఆర్మీ కౌంటర్‌

1 Feb, 2018 02:29 IST|Sakshi
అల్లరిమూకల రాళ్ల దాడి

షోపియాన్‌ ఘటనపై సైన్యం ఎఫ్‌ఐఆర్‌

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనలో ఓ మేజర్‌ సహా 10 మంది సైనిక సిబ్బందిపై ఆ రాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేయడంపై ఆర్మీ తీవ్రంగా స్పందించింది. కశ్మీర్‌ పోలీసులపై బుధవారం సైన్యం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. షోపియాన్‌ జిల్లాలోని గనోవ్‌పొరా నుంచి వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్‌పై అల్లరిమూకలు జనవరి 27న దాడిచేసిన సంగతి తెలిసిందే.

ఏడుగురు జవాన్లను గాయపర్చడంతో పాటు రాళ్లదాడిలో స్పృహ కోల్పోయిన జూనియర్‌ కమిషన్డ్‌ అధికారిని హతమార్చేందుకు, అతని సర్వీస్‌ తుపాకీని లాక్కునేందుకు ఆందోళనకారులు యత్నించడంతో ఆత్మరక్షణ కోసం ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో అప్పట్లో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల ఘటనపై కశ్మీర్‌లో తీవ్ర నిరసన వెల్లువెత్తడంతో సీఎం మెహబూబా ముఫ్తీ విచారణకు ఆదేశించారు. దీంతో పోలీసులు ఘర్వాల్‌ ఆర్మీ యూనిట్‌లోని ఓ మేజర్‌ సహా 10 మంది జవాన్లపై కేసు నమోదు చేశారు. జనవరి 27న ఆర్మీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ మరో యువకుడు బుధవారం చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. 

మరిన్ని వార్తలు