విషమం‍గానే జైట్లీ ఆరోగ్యం: మంత్రుల పరామర్శ

17 Aug, 2019 11:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ (66) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఈ నెల 9న ఆయన తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఇంకా కోలుకోకపోవడంతో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్‌ నాయకులు శనివారం జైట్లీని పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అదేవిధంగా కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ సింగ్వీ ‘జైట్లీ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని పార్థిస్తున్నా’  అంటూ ట్వీట్‌ చేశారు. శిరోమణి అకాళీదళ్‌ నేత మంజిందర్ ఎస్ సిర్సా కూడా జైట్లీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జైట్లీ.. తనకు మెంటర్‌ వంటి వారని, అంతే కాకుండా 1984 సిక్కుల ఊచకోత బాధితులకు న్యాయం జరగాలని పోరాడిన వ్యక్తి అంటూ ఆయన గుర్తుచేసుకున్నారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైట్లీని శుక్రవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వైద్యశాలకు వెళ్లి జైట్లీని పరామర్శించిన విషయం తెలిసిందే. మళ్లీ రాత్రి 11 గంటల సమయంలో హోం మంత్రి అమిత్‌ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌లు కూడా ఆసుపత్రికి వెళ్లి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.  జైట్లీ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆగస్టు 9 రోజు రాత్రే ఎయిమ్స్‌ ఓ ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే. తర్వాత జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

మరిన్ని వార్తలు