న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా అంశంపై ఆంధ్రప్రదేశ్ ఎంపీలు చేస్తున్న ఆందోళనపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఏపీకి సహాయం చేసే విషయంలో తాము కృత నిశ్చయంతో ఉన్నామని ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడినట్లు జైట్లీ పేర్కొన్నారు. సమస్యలకు పరిష్కారం కనుక్కుంటామని ఆయన అన్నారు. కాగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లోక్సభలో వైఎస్సార్సీపీ ఎంపీలు పోరాటం కొనసాగిస్తున్నారు.
వరుసగా రెండోరోజూ వాయిదా తీర్మానం ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు సభలో చర్చకు పట్టుబట్టారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ అంగీకరించకపోవడంతో నిరనన తెలిపారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఫ్లకార్డులు ప్రదర్శించారు. హామీ నిలబెట్టుకుని ఏపీకి న్యాయం చేయాలని నినదించారు. ఆందోళన విరమించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా వైఎస్సార్సీపీ ఎంపీలు పట్టువీడలేదు. ఎంపీల నినాదాల మధ్యే లోక్సభాపతి ప్రశ్నోత్తరాలు కొనసాగించారు.