మైనర్‌ను రేప్‌ చేస్తే మరణశిక్షే

17 Mar, 2018 02:09 IST|Sakshi

ఇటానగర్‌: అరుణాచల్‌ప్రదేశ్‌లో మహిళలపై నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మైనర్‌ బాలికలపై అత్యాచారానికి పాల్పడే మృగాళ్లకు మరణశిక్ష లేదా 14 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధించేలా రూపొందించిన బిల్లుకు అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ శుక్రవారం ఆమోదముద్ర తెలిపింది. క్రిమినల్‌ లాస్‌(అరుణాచల్‌ ప్రదేశ్‌) సవరణ బిల్లు–2018ను రాష్ట్ర హోంమంత్రి కుమార్‌ వాయి సభలో ప్రవేశపెట్టారు.

ఈ బిల్లు ప్రకారం 12 ఏళ్లలోపు బాలికల(మైనర్‌)పై అత్యాచారానికి పాల్పడే వ్యక్తులకు మరణశిక్ష లేదా 14 ఏళ్లకు తగ్గకుండా కఠిన కారాగారశిక్ష విధిస్తారు. ఈ శిక్షను యావజ్జీవశిక్షగా కూడా మార్చవచ్చు. వీటితో పాటు దోషులకు జరిమానా కూడా విధించవచ్చు. 2015 నుంచి 2017 నవంబర్‌ వరకూ రాష్ట్రంలో 225 రేప్‌ కేసులు నమోదుకాగా.. ఒక్క 2016లోనే 91 అత్యాచార కేసులు నమోదయ్యాయి. దీంతో మహిళలకు తగిన రక్షణ కల్పించడంలో భాగంగా పలువురు సభ్యుల సిఫార్సుతో అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఈ చట్టానికి రూపకల్పన చేసింది. 

మరిన్ని వార్తలు