న్యూఢిల్లి: సందు దొరికితే చాలు కేంద్ర ప్రభుత్వంపైన, ప్రధానమంత్రి నరేంద్రమోదీపైన విరుచుకుపడే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఉన్నట్టుండి ప్రధానమంత్రిపై ప్రశంసల జల్లు కురిపించారు. మహారాష్ట్రలోని లాతూర్ ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను పరిష్కరించడంలో నరేంద్రమోదీ తీసుకున్న చొరవను అభినందిస్తూ కేజ్రీవాల్ లేఖ రాశారు.
"21వ శతాబ్దంలో భారతదేశంలో ఎవరైనా దాహంతో చనిపోతే అది దేశానికే అరిష్టం. లాతూర్ ప్రజల దాహార్తిని తీర్చడానికి దేశమంతా సిద్ధంగా ఉండాలి. లాతూర్ కు అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులు సాయమందించాలి'' అని కేజ్రీవాల్ తన లేఖలో పేర్కొన్నారు. లాతూర్ ప్రజలకు సాయమందించడానికి ఢిల్లీ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.