న్యూఢిల్లీ: తెలంగాణపై త్వరలోనే తీపి కబురు వింటారని ఓయు జెఎసి నేతలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ చెప్పారు. అంతటితో ఊరుకోకుండా వారికి ఆయన స్వీట్లు కూడా ఇచ్చారు. ఓయు జెఎసి విద్యార్థులు ఈరోజు దిగ్విజయ్ సింగ్ను కలిశారు. తెలంగాణపై నిర్ణయం త్వరగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వీట్లు ఇవ్వడం కాదు, తెలంగాణ ప్రజలకు తీపికానుకగా తెలంగాణ ఇవ్వాలని కోరారు.వచ్చే 12న కోర్కమిటీలో తెలంగాణ అంశం తేల్చాలని డిమాండ్ చేశారు. 23లోగా తెలంగాణపై ప్రకటన చేయకుంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రజలు ఓటేస్తారని ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవి హెచ్చరించారు.
'నివేదికలు అందగానే కోర్ కమిటీ భేటీ'
దిగ్విజయ్ సింగ్ ఉదయం జాతియ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహల నుంచి తెలంగాణపై నివేదికలు అందిన వెంటనే కోర్కమిటీ సమావేశమవుతుందని చెప్పారు. కోర్కమిటీ సమావేశంలో తెలంగాణపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణపై స్పష్టమైన గడువు ఏమీ లేదని చెప్పారు. కోర్కమిటీలో ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీలకు రోడ్మ్యాప్ ప్రజంటేషన్ చూపిస్తామన్నారు. ఈ అంశంపై ఎవరైనా తనతో మాట్లాడవచ్చునని, తన ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని దిగ్విజయ్ సింగ్ చెప్పారు.