ఖైదీ ఒంటిపై ఓం సింబల్‌.. స్పందించిన ఓవైసీ

20 Apr, 2019 11:13 IST|Sakshi

న్యూఢిల్లీ : తీహార్‌ జైలులో ఓ ముస్లిం ఖైదీ వీపు మీద బలవంతంగా ఓం గుర్తును ముద్రించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనపై ఏఐఎంఐఎం అధినేత, అసదుద్దీన్‌ ఓవైసీ స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. ‘మమ్మల్ని అవమానించడానికి రోజుకోక కొత్త మార్గాన్ని కనిపెడుతున్నారు. అతన్ని ఓ పశువులాగా భావించి ఓం గుర్తును ముద్రించారు. ఇది చాలా అసాధరణమేకాక ఎంతో అవమానకరం కూడా. మేము మనుషులమే.. వస్తువులం కాదు. కావాలనే నబ్బీర్‌ ఒంటి మీద ఈ ప్రత్యేక గుర్తును ముద్రించారు.. తప్ప ఇందుకు వేరే ఇతర బలమైన కారణాలు ఏం లేవు కదా’ అని ట్వీట్‌ చేశారు.

ఇంతకు విషయం ఏంటంటే షబ్బీర్‌ అలియాస్‌ నబ్బీర్‌ అనే వ్యక్తి తీహార్‌ జైలులో ఖైదీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం నబ్బీర్‌.. తమ బ్యారక్‌లోని ఇండక్షన్‌ స్టవ్‌ సరిగా పని చేయడం లేదని అధికారులకు ఫిర్యాదు చేశాడు. దాంతో వారు ‘ఫిర్యాదులు చేస్తున్నావ్‌.. నాయకుడిగా ఎదగాలని చూస్తున్నావా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక అతన్ని ఓ గదిలోకి తీసుకెళ్లి చితకబాదారు. అంతటితో ఊరుకోక మెటల్‌ ఓం సింబల్‌ని తీసుకొచ్చి.. కాల్చి దాన్ని నబ్బీర్‌ వీపు మీద ముద్రించారు. ఓ రెండు రోజుల పాటు అతనికి భోజనం కూడా పెట్టలేదు.

ఈ విషయం గురించి తోటి ఖైదీలకు ‘నబ్బీర్‌ హిందువుగా మారాడు. ప్రస్తుతం నవరాత్రి దీక్ష చేస్తున్నాడు. దానిలో భాగంగా ఉపవాసం ఉన్నాడని’ తెలిపారు. ఈ క్రమంలో జైలులో తనకు జరిగిన అవమానం గురించి నబ్బీర్‌ తన కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. ఈ క్రమంలో ఈ నెల 17న నబ్బీర్‌ కేసు ఢిల్లీ కోర్టులో విచారణకు వచ్చింది. ఆ సమయంలో నబ్బీర్‌ తల్లి జైలులో తన కొడుకుకు ప్రాణాపాయం ఉందని బెయిల్‌ మంజూరు చేయమని కోర్టును కోరింది. దాంతో న్యాయమూర్తి విషయం ఏంటని ప్రశ్నించగా ఈ వ్యవహారం వెలుగు చూసింది.

మరిన్ని వార్తలు