ఆశాభోస్లేకు యశ్‌ చోప్రా మెమోరియల్‌ అవార్డు

27 Jan, 2018 21:23 IST|Sakshi

భారతీయ కళలను, సంస్కృతిని ప్రోత్సహించే కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి జాతీయ స్థాయిలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత యశ్ చోప్రాతో ఆయనది ఎనలేని బంధం. ఆ అనుబంధం తోనే యశ్ చోప్రా తనువు చాలించిన తరువాత సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ తరఫున 2013 నుంచి నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డును సినీ ప్రముఖులకు అందజేస్తున్నారు. 2017 సంవత్సరానికి గానూ ఈ అవార్డును ప్రముఖ నేపథ్య గాయని, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ ఆశాభోస్లేకు ఇవ్వనున్నారు. శనివారం ముంబైలో సమావేశమైన టి. సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ జ్యూరీ సభ్యులు సర్వశ్రీ బోనీకపూర్, మాధుర్ భండార్కర్, హనీ ఇరానీ, పద్మినీ కొల్హాపురి, సుబ్బరామిరెడ్డి,  ఆశాభోస్లే పేరును నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డుకు ఎంపిక చేశారు.

గతంలో ఈ అవార్డును లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్,  రేఖ, షారుక్ ఖాన్ అందుకున్నారు. ఎప్పటిలానే ఈ సారి కూడా ఈ అవార్డు ప్రదానోత్సవం ముంబైలో ఫిబ్రవరి 16న ఘనంగా జరుగుబోతోంది. మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావుతో పాటు లతామంగేష్కర్ చేతుల మీదుగా 'నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు -2017'ను ఆశాభోస్లే అందుకోబోతున్నారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్, ఆమీర్ ఖాన్, షారుక్ ఖాన్, శ్రీదేవి, జయప్రద తదితరులు పాల్గొనబోతున్నారు. 

1933లో జన్మించిన ఆశాభోస్లే పదేళ్ళ వయసులోనే నేపథ్య గాయనిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. గడిచిన 75 సంవత్సరాల్లో వందల చిత్రాలలో వేలాది గీతాలను ఆలపించిన ఆశాభోస్లే రెండు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డును అందుకోవడంతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు సంపాదించుకున్నారు. ఆమె కీర్తి కిరీటంలో 'నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డ్' మరో మైలు రాయిగా నిలువబోతోంది.

మరిన్ని వార్తలు