సోనెపట్: తన విధులను తాను నిర్వర్తించడమే ఆ ఏఎస్సై చేసుకున్న పాపమైంది. తప్పుచేసిన ఓ నాయకుడిపై కేసులు పెట్టడమే అతడికి మరణశాసనమైంది. ఎలాంటి ప్రభావానికి గురవ్వకుండా ఒక నాయకుడిపై కేసు నమోదు చేసిన ఏఎస్సైని అభినందించి కేసు దర్యాప్తునకు సహాయం అందించాల్సిన ఓ ఎస్పీ అతడిని తిట్టి బదిలీ వేటు వేయడంతో తన నిండు ప్రాణాలు బలితీసుకున్నాడు. ఉరేసుకున్నప్పటికీ ప్రాణం పోకపోవడంతో తన రివాల్వర్తో కాల్చుకొని చనిపోయాడు. ఈ విషయాన్ని అంతకుముందు తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. తన చావుకు కారణం ఎస్పీనే అని కూడా స్పష్టం చేశాడు.
ఈ ఘటన ముర్తాల్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రోహతక్కు చెందిన వీరేందర్ రోస్ అనే వ్యక్తి సోనేపట్ ప్రాంతంలో ఏఎస్సైగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అతడు ఓ మాజీ కౌన్సిలర్ సోదరుడు విమల్ కిషోర్ అనే వ్యక్తిపై తప్పుచేసినందుకు కేసు నమోదుచేశాడు. ఈ విషయాన్ని కిషోర్ సోనేపట్ ఎస్పీ అశ్విన్ షెన్వీకి ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్పీ అశ్విన్ ఆ ఏఎస్సైని మందలించడమే కాకుండా ముర్తాల్ పోలీస్ లైన్స్కు బదిలీ చేశాడు.
దీంతో తన హుందాతనం దెబ్బతిన్నదని, అంతకంటే అవమానం తనకు మరొకటి ఉండదనే ఒత్తిడిలోకి జారిపోయిన వీరేందర్ తన ప్రాణాలు బలితీసుకున్నాడు. ‘నాకు సోనేపట్ ఎస్పీ అశ్విన్ షెన్వీ నుంచి న్యాయం దొరకడం లేదు.. అందుకే చనిపోతున్నాను.. నేను ఇక ఏమాత్రం బతికి ఉండను’ అని చెప్పడమే కాకుండా పలు విషయాలు పేర్కొన్నాడు.