ఎంట్రీ పాస్ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతి

7 Apr, 2020 16:22 IST|Sakshi

గువాహటి: దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ఉన్న నేప‌థ్యంలో ఎక్క‌డి వారు అక్క‌డే ఉండిపోయారు. ఏప్రిల్ 14 న లాక్‌డౌన్ ముగిసిన త‌ర్వాత రాష్ర్టంలోకి అనుమ‌తించే వారి విష‌యంలో ప‌ర్మిట్ వ్య‌వ‌స్ధ‌ను ప్రారంభించనున్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది. లాక్ డౌన్ ముగిసిన తరువాత పెద్ద సంఖ్యలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న తమ రాష్ట్ర పౌరులు సొంత రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న అస్సాం ప్రభుత్వం... వారిని ద‌శ‌ల వారిగా అనుమ‌తించాలని భావిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు  ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

త్వ‌ర‌లోనే  ఇందుకు సంబంధించి ఓ వైబ్‌సైట్‌ను ప్రారంభిస్తామని, రాష్ట్రానికి రావాలనుకునే వాళ్లు ముందుగా ఆ వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ప్ర‌తిరోజు కొంత మందిని మాత్ర‌మే రాష్ర్టంలోకి అనుమతిస్తామ‌ని, ఒక‌వేళ క‌రోనా ల‌క్ష‌ణాలుంటే వారిని క్వారంటైన్ సెంట‌ర్ల‌కు త‌ర‌లిస్తామ‌ని పేర్కొన్నారు. గ‌త నెల‌లో నిజాముద్దీన్ త‌బ్లీగి జ‌మాత్‌కు వెళ్లిన‌వారు అధికారుల‌కు స‌మాచారం అందివ్వాల‌ని అన్నారు. ఒక‌వేళ వాళ్లు రిపోర్ట్ చేయ‌ని ప‌క్షంలో విపత్తు నిర్వహణ చట్టం నిబంధ‌న ప్ర‌కారం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. రాష్ర్టం నుంచి 617 మంది జ‌మాత్‌కు హాజరైనట్లు ఆరోగ్య శాఖ అంచనా వేసింది. 

మరిన్ని వార్తలు