17 ఏళ్ల తర్వాత వచ్చి ఉద్యోగం కావాలన్నాడు

3 Nov, 2019 04:21 IST|Sakshi

న్యూఢిల్లీ: తొలగింపుకు గురైన ఓ ఐఏఎస్‌ అమెరికాలో ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా చేరి, తిరిగి 17 ఏళ్ల తర్వాత భారత్‌ వచ్చి తనకు ఉద్యోగం ఇప్పించాలని ప్రధాని మోదీని కోరిన ఘటన ఇటీవల జరిగింది. 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి రాజేష్‌ సింగ్‌ ఉత్తరప్రదేశ్‌లో పోస్టింగ్‌ అందుకున్నాడు. పీహెచ్‌డీ కోసం రెండేళ్లకాలానికి ప్రభుత్వ అనుమతితో 1996లో అమెరికా వెళ్లారు. తర్వాత భారత్‌కు రాలేదు. ఉత్తరాఖంఢ్‌లో ఆయనకు పోస్టింగ్‌ వచ్చింది. తర్వాత 2001 ఆగస్టు 12 వరకూ సెలవులు కోరుతూ దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం ఓకే చెప్పింది. మళ్లీ 2001 డిసెంబర్‌ 31 వరకూ సెలవులు పొడిగించుకున్నారు.

మళ్లీ ఆరునెలలు కావాలంటూ దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం తిరస్కరించింది. విధుల్లో చేరాలని యూపీ ప్రభుత్వం ఆదేశించింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో, చట్టం ప్రకారం  ఐదేళ్లకు మించి విధులకు దూరంగా ఉండటంతో విధుల నుంచి 2003లో తొలగించారు. తనను విధుల్లో చేర్చుకోవాలంటూ 2017లో మోదీకి ఆయన లేఖ రాశారు. మోదీ దాన్ని తిరస్కరించడంతో, సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అక్కడా తిరస్కరణే ఎదురైంది. కొద్ది రోజుల పాటు సెలవులు పెడితేనే వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుందని, అలాంటిది సంవత్సరాల తరబడి సెలవులు ఎలా పెడతారని ట్రిబ్యునల్‌ మొట్టికాయలు వేసింది.

మరిన్ని వార్తలు