-

‘అయోధ్య’ రామయ్యదే..!

10 Nov, 2019 02:29 IST|Sakshi

ఐదు శతాబ్దాల సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్న భారతావని

వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణం

ముస్లింలకు మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే ఐదెకరాలు

అత్యంత సున్నితమైన అయోధ్య కేసులో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

రామమందిర నిర్మాణం కోసం 3 నెలల్లోగా ట్రస్ట్‌ ఏర్పాటు

భక్తి, విశ్వాసాల ప్రాతిపదికన కాకుండా భూ యాజమాన్య దావాగానే విచారణ

హిందూ సంస్థల హర్షాతిరేకాలు..

తీర్పులో పొరపాట్లున్నా గౌరవిస్తున్నామన్న ముస్లిం సంస్థలు

న్యాయం, సౌభ్రాతృత్వం, మత విశ్వాసాలపై సమాన గౌరవం తదితర రాజ్యాంగ విలువలు ప్రతిఫలించేలా తీర్పును లిఖించామని భావిస్తున్నాం.

1949, డిసెంబర్‌ 22 అర్ధరాత్రి రాముడి విగ్రహాలు ఉంచడం, 1992లో మసీదును కూల్చడం.. రెండూ తప్పులే.. ఆ తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని మత విశ్వాసాలను భారత రాజ్యాంగం సమంగా గౌరవిస్తుంది. సహనం, పరస్పర గౌరవంతో కలిసి మెలిసి జీవించడం ద్వారా భారత లౌకిక భావన మరింత బలోపేతమవుతుంది.-తీర్పు వెలువరించినన్యాయమూర్తులు 

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ ఒకవంక.. తదనంతర పరిణామాలపై ఆందోళన మరోవంక ఉన్న నేపథ్యంలో... కిక్కిరిసిన కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తుది తీర్పును వెలువరించారు. జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ అశోక్‌భూషణ్, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌ సభ్యులుగా ఉన్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును ఏకగ్రీవంగా ప్రకటించింది. 1045 పేజీల తీర్పులోని కీలకాంశాలను జస్టిస్‌ గొగోయ్‌ చదివి విన్పించారు. వివాదాస్పద స్థలం శ్రీరాముడి జన్మస్థలమేనన్న హిందువుల అచంచల విశ్వాసాన్ని కొట్టిపారేయలేమని, అలాగే, బాబ్రీ మసీదు కూల్చివేత ద్వారా జరిగిన తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ‘జరిగిన తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. న్యాయపాలన సాగే లౌకిక దేశంలో మసీదును కోల్పోయిన నష్టానికి ముస్లింలకు తగిన పరిహారం ఇవ్వడాన్ని కోర్టు పట్టించుకోకపోతే న్యాయం జయించినట్లు కాదు’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘ఆ తప్పుకు పరిహారంగా.. అయోధ్యలోనే మసీదు నిర్మాణం కోసం ఐదేకరాల స్థలాన్ని ముస్లింలకు కేటాయించాలి’ అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ స్థలాన్ని 1993 నాటి అయోధ్య చట్టం ద్వారా సేకరించిన భూమి నుంచి కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ సున్నీ వక్ఫ్‌ బోర్డ్‌కు అప్పగించాలని సూచించింది. ‘వివాదాస్పద 2.77 ఎకరాల స్థలం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అ«దీనంలో ఉంటుంది. అనంతరం కేంద్రం నియమించిన ట్రస్ట్‌కు ఆ భూమిని అప్పగిస్తారు. రామ మందిర నిర్మాణాన్ని ఆ ట్రస్ట్‌ పర్యవేక్షిస్తుంది’ అని ధర్మాసనం వివరించింది. 

అలహాబాద్‌ హైకోర్టు తీర్పు తప్పు 
వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని నిర్మోహీ అఖాడా, సున్నీ వక్ఫ్‌ బోర్డ్, రామ్‌ లల్లాలకు సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్‌ హైకోర్టు ఇచి్చన తీర్పును రాజ్యాంగ ధర్మాసనం తప్పుబట్టింది. ఆ వివాదాస్పద భూమి రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదై ఉందని గుర్తు చేసింది. ‘కూలి్చవేతకు గురైన బాబ్రీమసీదుకు అడుగున తమ తవ్వకాల్లో ఒక హిందూ నిర్మాణ శైలితో ఉన్న నిర్మాణం బయటపడిందని పురావస్తు శాఖ పేర్కొంది. అది ఇస్లామిక్‌ నిర్మాణంలా లేదు అని కూడా చెప్పింది’ అని వివరించింది. 

ఐదుగురు జడ్జీలు.. 40 రోజులు 
2010నాటి అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కలీఫుల్లా, సీనియర్‌ న్యాయవాది శ్రీరాం పంచుల మధ్యవర్తిత్వ కమిటీ కూడా ఈ సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొనలేకపోయింది. చివరగా, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 40 రోజుల పాటు ఏకబిగిన విచారణ జరిపి ఈ అక్టోబర్‌ 16న తీర్పు రిజర్వ్‌లో పెట్టింది. తుది తీర్పును శనివారం ప్రకటించింది.

‘హిందూ’ ఆధారాలు మెరుగ్గా ఉన్నాయి..
వివాదాస్పద భూమి తమకే చెందుతుందనేందుకు హిందు వర్గాలు చూపిన ఆధారాలు.. ముస్లిం వర్గాలు చూపిన ఆధారాల కన్నా మెరు గ్గా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ‘1857 లో కంచెను నిర్మించినప్పటికీ.. మసీదు బయటి ప్రాంగణంలో హిందువుల పూజలు నిరంతరాయంగా కొనసాగాయని నిర్ధారణ అయింది. ఆ ప్రాంతం హిందువుల అ«దీనంలో ఉందనేందు కు సాక్ష్యాధారాలున్నాయి. 1857లో అవధ్‌ రాజ్యాన్ని బ్రిటిషర్లు స్వా«దీనం చేసుకున్న నాటి ముందు నుంచి ఆ నిర్మాణం లోపలి ప్రాంగణంలోనూ హిందువులు పూజలు చేశారనేందుకే ఎక్కువ ఆధారాలున్నాయి. కాగా, 16వ శతాబ్దంలో నిర్మాణం జరుపుకున్నప్పటి నుంచి 1857 వరకు ఆ మసీదు అంతర్భాగం పూర్తిగా తమ అధీనంలోనే ఉందనేందుకు సరైన ఆధారాలను ముస్లింలు చూపలేకపోయారు’ అని తీర్పులో పేర్కొంది.

సివిల్‌ దావాగానే.. 
‘ఈ కేసును నమ్మకం, విశ్వాసాల ప్రాతిపదికగా విచారించలేదు. రామ్‌లల్లా, నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్‌ బోర్డు అనే మూడు పార్టీల మధ్య స్థిరాస్తికి సంబంధించిన సివిల్‌ వివాదంగానే దీన్ని పరిగణించాం. 2.77 ఎకరాల వివాదాస్పద భూమికి వాస్తవ యజమాని ఎవరనే విషయాన్నే ప్రాతిపదికగా తీసుకున్నాం. ప్రజల భక్తివిశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా తీర్పును ఇవ్వడం లేదు. సాక్ష్యాధారాలను పరిశీలించి, వాటి ఆధారంగానే తీర్పు ప్రకటిస్తున్నాం’ అని ధర్మాసనం తేలి్చచెప్పింది. మసీదు ప్రధాన గుమ్మటం ఉన్న ప్రదేశమే రాముని జన్మస్థలమన్న హిందువుల అచంచల విశ్వాసం నిర్వివాదాంశమేనని వ్యాఖ్యానించింది. 

కీలకంగా ‘పురావస్తు’ ఆధారాలు! 
తీర్పులో భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) అందించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకున్నామని కోర్టు తెలిపింది. ‘పురావస్తు శాఖ అందించిన ఆధారాలను తేలిగ్గా, కేవలం అభిప్రాయాలుగా కొట్టిపారేయలేం. బాబ్రీ మసీదును ఖాళీ ప్రదేశంలో నిర్మించలేదని, అప్పటికే ఉన్న ఒక హిందూ నిర్మాణాన్ని కూల్చివేసి నిర్మించారని ఏఎస్‌ఐ చూపిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ నిర్మాణం క్రీ.శ 12వ శతాబ్దంలో నిర్మితమైందని పేర్కొంది. క్రీ.శ 8–10 శతాబ్దాల కాలానికి చెందిన హిందూ పూజా విధానాన్ని చూపే శిథిలాలు గుర్తించింది. అయితే, ఆ నిర్మాణం హిందువుల దేవాలయమేనని ఆ ఆధారాలు నిర్ధారించలేదు’ అని పేర్కొంది.

సుప్రీంకోర్టు తీర్పు ఇదీ..
2.77 ఎకరాల వివాదాస్పద స్థలం మొత్తం రామ మందిర నిర్మాణానికే.

‘ఈ కేసును నమ్మకం, విశ్వాసాల ప్రాతిపదికగా కాదు.. రామ్‌లల్లా, నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్‌ బోర్డు అనే 3 పార్టీల మధ్య స్థిరాస్తికి సంబంధించిన సివిల్‌ వివాదంగా పరిగణించాం. 2.77 ఎకరాల వివాదాస్పద భూమికి వాస్తవ యజమాని ఎవరనేదే ప్రాతిపదికగా తీసుకున్నాం. భక్తి విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా తీర్పునివ్వడం లేదు. సాక్ష్యాధారాలను పరిశీలించి, వాటి ఆధా రంగానే తీర్పు ప్రకటిస్తున్నాం. మసీదు ప్రధాన గుమ్మటం ఉన్న ప్రదేశమే రాముని జన్మస్థలమన్న హిందువుల అచంచల విశ్వాసం నిర్వివాదాంశమే..

మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో 5 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్‌ బోర్డుకు అప్పగించాలి. ఆ భూమిని అయోధ్య చట్టం, 1993 ద్వారా సేకరించిన భూమి నుంచి కేంద్ర ప్రభుత్వం కానీ.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కానీ పరస్పర సంప్రదింపుల ద్వారా అప్పగించాలి. ఈ ఆదేశాలను ఈ కోర్టుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 ద్వారా లభించిన అధికారాల ద్వారా ఇస్తున్నాం. 

రామ జన్మభూమిగా విశ్వసిస్తున్న ప్రదేశంలో రామ మందిర నిర్మాణ బాధ్యతలను చూసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలి. ట్రస్ట్‌ సభ్యులను కేంద్రం ఎంపిక చేయాలి. ఇందుకు కేంద్రానికి 3 నెలల గడువు ఇస్తున్నాం. ట్రస్ట్‌లో నిర్మోహి అఖాడాకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలి. 

1857లో కంచెను నిర్మించినప్పటికీ మసీదు బయటి ప్రాంగణంలో హిందువుల పూజలు నిరంతరాయంగా కొనసాగాయని నిర్ధారణ అయింది. ఆ ప్రాంతం హిందువుల అధీనంలో ఉందనేందుకు సాక్ష్యాధారాలున్నాయి. 1857లో ఔధ్‌ రాజ్యాన్ని బ్రిటిషర్లు స్వా«దీనం చేసుకున్న నాటి ముందు నుంచి ఆ నిర్మాణం లోపలి ప్రాంగణంలోనూ హిందువులు పూజలు చేశారనేందుకే ఎక్కువ ఆధారాలున్నాయి. కాగా, 16వ శతాబ్దంలో నిర్మాణం జరుపుకున్నప్పటి నుంచి 1857 వరకు ఆ మసీదు అంతర్భాగం పూర్తిగా తమ అధీనంలోనే ఉందనేందుకు సరైన ఆధారాలను ముస్లింలు చూపలేకపోయారు. 

ముస్లింలకు ప్రత్యామ్నాయ భూమిని ఇవ్వాల్సిన అవసరం ఉంది. వివాదాస్పద భూమి తమకే చెందుతుందనేందుకు హిందూ వర్గాలు చూపిన ఆధారాలు.. ముస్లిం వర్గాలు చూపిన ఆధారాల కన్నా మెరుగ్గా ఉన్నాయి.

పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ) అందించిన ఆధారాలను తేలిగ్గా, కేవలం అభిప్రాయాలుగా కొట్టిపారేయలేం. బాబ్రీ మసీదును ఖాళీ ప్రదేశంలో నిర్మించలేదని, అప్పటికే ఉన్న ఒక హిందూ నిర్మాణాన్ని కూలగొట్టి నిర్మించారని ఏఎస్‌ఐ చూపిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఆ హిందూ నిర్మాణం హిందువుల దేవాలయమేనని ఆ ఆధారాలు నిర్ధారించడం లేదు. 

వివాదాస్పద ప్రదేశాన్ని మూడు సమాన భాగాలుగా విభజించి, రామ్‌ లల్లా, నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్‌ బోర్డ్‌లకు అప్పగిస్తూ 2010లో అలహాబాద్‌ హైకోర్టు ఇచి్చన తీర్పు సరైంది కాదు. భూ యాజమాన్య హక్కులను నిర్ధారించడంలో హైకోర్టు పొరపాటు చేసింది. వివాదాస్పద స్థలంలోని ప్రధాన భాగం 1500 గజాలు. దాన్ని మూడు భాగాలుగా విభజించడం ఆచరణ సాధ్యం కాదు. దీని వల్ల శాంతీ నెలకొనదు.  

గెలుపోటముల కోణంలో చూడొద్దు..
అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ఏ ఒక్క వర్గం గెలుపు లేదా ఓటమిగా భావించరాదు. దేశ ప్రజలంతా శాంతి సామరస్యాలతో మైత్రీభావంతో మెలగాలి. రాముడు లేదా రహీం ఎవరిని పూజించే వారైనా సరే అంతకు మించి ప్రతి ఒక్కరూ దేశభక్తి భావాన్ని పెంపొందించుకోవాలి. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యకు సుప్రీంకోర్టు సామరస్యపూర్వక పరిష్కారం చూపింది. – ట్విట్టర్‌లో ప్రధాని మోదీ

తీర్పును స్వాగతిస్తున్నాం..
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. దీనిపై మరోసారి కోర్టుకు వెళ్లం. ప్రస్తుతానికి తీర్పును క్షుణ్ణంగా పరిశీలిస్తు న్నాం. త్వరలోనే దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తాం. లాయర్‌ ఎవరైనా తీర్పుపై సవాల్‌ చేస్తామని చెప్పినప్పటికీ అది సరైంది కాదు. – సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌ ఫరూఖీ

సుప్రీం తీర్పును గౌరవిస్తాం..
‘అయోధ్యలో రామాలయం నిర్మాణంపై సానుకూలంగా ఉన్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. ఈ విషయంతో సంబంధం ఉన్న అన్ని వర్గాలు, వ్యక్తులు తీర్పునకు కట్టుబడి లౌకిక విలువలను పరిరక్షించాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన సౌభ్రాతృత్వ భావనకు కట్టుబడి ఉండాలి. ప్రజలంతా శాంతి సామరస్యాలను కాపాడాలి. పరస్పర గౌరవించుకోవడం, ఐకమత్యంతో ఉండటం వంటి మన సంప్రదాయ విలువలను గౌరవిద్దాం’ అని కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ అధ్యక్షతన సమావేశమైన పార్టీ వర్కింగ్‌ కమిటీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. కాగా, ‘తీర్పును గౌరవిస్తున్నాం. భారతీయుల సోదరభావానికి, నమ్మకానికి, ప్రేమకు ఇదే సరైన సమయం’ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. 

తీర్పును సవాల్‌ చేయబోం..
అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు సంతృప్తి కలిగించింది. ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు ముగింపు పలకడం సంతోషదాయకం. దీనిని సవాల్‌ చేస్తూ మళ్లీ కోర్టులో పిటిషన్‌ వేయబోము. కోర్టు తీర్పు ఏదైనా సరే సరైందేనని మేం నమ్ముతున్నాం.  – కక్షిదారు ఇక్బాల్‌ అన్సారీ 

మరిన్ని వార్తలు