‘రేపిస్టులపై ప్రతీకారం తీర్చుకోండి’

28 Jun, 2017 15:40 IST|Sakshi
‘రేపిస్టులపై ప్రతీకారం తీర్చుకోండి’

లక్నో: వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ మంత్రి ఆజంఖాన్‌ మరోసారి కలకలం రేపారు. మహిళలపై అకృత్యాలకు తెగబడే సైనికులపై తిరగబడాలని సూచించారు. సైనిక రేపిస్టులపై ప్రతీకారం తీర్చుకోవాలని, వారి మర్మవయాలు కోసి పాడేయాలని అన్నారు. పశ్చిమ యూపీలోని రాంపూర్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ... జమ్మూకశ్మీర్‌ లాంటి సున్నిత రాష్ట్రాల్లో మహిళలపై సైనికుల దురాగతాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

‘కశ్మీర్‌, జార్ఖండ్‌, అస్సోంలో అకృత్యాలకు పాల్పడిన సైనికులను మహిళలు చితక్కొట్టాలి. వారి గుప్తవయవాలను ఖండించాలి. ఆర్మీ రేపిస్టులకు మహిళలు తగిన గుణపాఠం చెప్పాలి. ఆరు దశాబ్దాల తర్వాత భారతదేశం దారి తప్పింది. బ్యాలెట్‌ బదులుగా బుల్లెట్‌ విధానాన్ని స్వీకరించింది. పర్యవసానం ఎలా ఉందో మనమంతా చూస్తున్నామ’ని ఆజంఖాన్‌ అన్నారు. అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరగకుండా ఉండాలంటే మహిళలు ఇళ్లలో ఉండటమే మేలని గత నెలలో ఆయన సలహాయిచ్చి వివాదంలో చిక్కుకున్నారు.

మరిన్ని వార్తలు