రాంపూర్: సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ మంత్రి ఆజమ్ ఖాన్ మరోసారి వివాదానికి తెరలేపారు. గతంలో తాజ్మహల్ కూల్చి శివాలయం నిర్మించాలంటూ వివాదాన్ని సృష్టించిన ఆయన.. తాజాగా మరో వివాదాన్ని రగిలించారు. రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ భవనాలు బానిసత్వానికి ప్రతీకలని, వాటిని కూలగొట్టాలంటూ వ్యాఖ్యానించారు.
రాంపూర్లోని డిగ్రీ కళాశాలలో జరిగిన ఒక సెమినార్లో ప్రసంగించిన ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన ఈ భవనాలు బానిసత్వానికి చిహ్నాలని పేర్కొన్నారు. ఈ వరుసలో ముందు తాజ్మహల్, తరువాత రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ హౌస్ నిలుస్తున్నాయన్నారు. అందుకే వాటికి పడగొట్టాలన్నారు. ప్రజాధనాన్నిభారీగా వృధా చేసిన స్మారక కట్టడాల్లో తాజ్ మహల్ ఒకటనీ, అక్కడ నిలబడాలంటేనే తనకు నచ్చదన్నారు. అదొక క్రిమినల్ వేస్ట్ అంటూ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.