ఆజం ఖాన్‌కు మరో షాక్‌

16 Aug, 2019 11:48 IST|Sakshi

ప్రభుత్వ భూమి  ఆక్రమణ ఆరోపణలు

లగ్జరీ రిసార్ట్‌ ‘హం సఫర్‌’  గోడ కూల్చివేత

రాంపూర్‌:  వివాదాస్పద సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజం ఖాన్‌కు భారీ ఎదురు దెబ్బ. భూకబ్జా, ల్యాండ్‌ మాఫియా ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నఆజం ఖాన్‌కు తాజాగా మరో షాక్‌  తగలింది.  రాంపూర్‌లోని ఖాన్‌కు చెందిన లగ్జరీ రిసార్ట్‌ 'హంసఫర్' గోడనుఅధికారులు కూల్చివేశారు. కబ్జా ఆరోపణలతో బుల్డోజర్లు, జేసీబీ యంత్రాల సాయంతో కూల్చివేశారు. ఉత్తరప్రదశ్‌ నీటిపారుదల శాఖ ఆజం ఖాన్‌కు నోటీసులు  కూడా జారీ చేసింది.  రాష్ట్ర ప్రభుత్వ భూమిని ఆక్రమించి దీన్ని నిర్మించారని ఆరోపణలతో  అధికారులు ఈ చర్య చేపట్టారు. 

ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడినట్లు జిల్లా యంత్రాంగం నుంచి కూడా ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయి. పేద రైతులనుంచి వ్యవసాయ భూమిని, ప్రభుత్వ భూములను స్వాహా చేశాడన్న కేసులో అతనిపై వరుస కేసులు నమోదైనాయి. ఈ నేపథ్యంలోనే జూలై 29న ఆజం ఖాన్‌ను ల్యాండ్ మాఫియాగా ప్రకటించారు. అలాగే ఖాన్‌కు చెంది మహమ్మద్‌ అలీ జౌహార్యూనివర్శిటీకి విదేశీ విరాళాలకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై  ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం (ఈడీ) కూడా విచారణ చేపట్టింది. ఆయనపై నమోదైన కేసుల (30 దాకా)  వివరాలపై స్థానిక అధికారులను ఆరా తీస్తోంది. 

మరోవైపు ఆజం ఖాన్‌ కొనుగోళ్లకు  సంబంధించిన  రెవెన్యూ రికార్డులు, చెల్లింపు రశీదులు, ఇతర ఒప్పందాల వివరాలను రెవన్యూ శాఖను కోరామని రాంపూర్  ఎస్పీ అజయ్ పాల్ శర్మ తెలిపారు. అనేక వందల కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని, వీటిపై దర్యాప్తు  చేయాల్సి వుందన్నారు. 

మరిన్ని వార్తలు