సాక్షి, లక్నో : కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు జాతీయ రాజకీయాల్లో కీలక మలుపుగా యోగా గురు బాబా రాందేవ్ అభివర్ణించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే పార్టీనే 2019లో కేంద్రంలో అధికారం చేపడుతుందన్నారు. కర్ణాటకలో బీజేపీనే అధికారం చేపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరంపై గతంలో తాను చేసిన ఆరోపణలు ఇప్పుడు వాస్తవమేనని తేలుతున్నాయని చెప్పారు. ఆయన చీకటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయన్నారు.
గంగా ప్రక్షాళన కార్యక్రమంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గంగానదీ ప్రక్షాళనకు మరిన్ని చర్యలు చేపట్టాలని కోరారు. కాగా, ఏఎంయూలో మహ్మద్ జిన్నా చిత్ర పటానికి సంబంధించిన వివాదాన్ని ప్రస్తావిస్తూ దేశ విభజనకు కారకుడైన వ్యక్తి దేశానికి ఏమాత్రం ఆదర్శప్రాయం కాదని వ్యాఖ్యానించారు.