యూపీ మంత్రిపై భార్య హత్యారోపణలు

27 Sep, 2019 16:33 IST|Sakshi

సాక్షి, లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌ మంత్రి బాబు రామ్‌ నిషాద్‌ పై అతని భార్య నీతు నిషాద్‌ హత్యారోపణలు చేయడం సంచలనం రేపింది. తన భర్త తుపాకీతో చంపేస్తానంటూ బెదరింపులకు పాల్పడుతున్నారంటూ నీతు ఆరోపించారు. ఈ క్రమంలో ఎన్నోసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, పోలీసులు తన భర్తకే వత్తాసు పలకడం విచారకరమన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల తన భర్త కొట్టేవాడని ఆమె ఆరోపించారు.

రాష్టానికి మంత్రిగా ఉండి ఇలా వ్యవహరించడం చింతించాల్సిన విషయమన్నారు. ఈ విషయమై నీతు ప్రధాని నరేంద్ర మోదీకి, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. అయితే బాబురామ్‌ మాత్రం తన భార్య ఆరోపణలను పూర్తిగా కొట్టిపడేశారు. తాను విడాకులకు దరఖాస్తు చేసినందుకే తన భార్య కక్షపూరితంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఈ క్రమంలో నీతు మాత్రం తన మీద భర్త చేస్తున్న ఆరోపణలకు కోర్టులోనే సమాధానం చెబుతానని మీడియా ముఖంగా పేర్కొన్నారు. నీతు తన వ్యక్తిగత ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో వరుస పోస్టులతో తన దుస్థితిని వివరించడం గమనార్హం.

మరిన్ని వార్తలు