న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన అధికారులకు ఏప్రిల్ 21న సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ప్రధాని మోదీ అవార్డులు అందించనున్నారు. వివిధ శాఖల అధికారుల నుంచి మొత్తం 623 జిల్లాల నుంచి 2010 దరఖాస్తులు వచ్చినట్లు కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ ఏడాది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, డిజిటల్ చెల్లింపులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్, రూరల్), దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన అధికారులకు అవార్డులు ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వంలో సేవలందిస్తున్న అడిషనల్ సెక్రటరీ /జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్/ డిప్యూటీ సెక్రటరీ హోదాలో ఉన్న అధికారులకు ఈ అవార్డులు అందిస్తారు. కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిలో వాతావరణ పరిరక్షణకు, విపత్తుల నిర్వహణ, జలవనరుల సంరక్షణ, విద్యుత్, విద్య, ఆరోగ్యం, మహిళలు, శిశువుల సంక్షేమానికి కృషి చేసిన వారికి కూడా అవార్డులు అందజేస్తారు.