గణేష్ మహోత్సవం ఎఫెక్ట్

20 Aug, 2014 22:17 IST|Sakshi

సాక్షి, ముంబై: గణేష్ ఉత్సవాల సమయంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ముంబై-గోవా జాతీయ రహదారిపై భారీ వాహనాలను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా  ప్రజలు ఉత్సవాలు సంతోషంగా జరుపుకుని తిరిగి ముంబైకి చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణ శాఖ తెలిపింది.

 గణేష్ ఉత్సవాలు ప్రారంభానికి మూడు రోజుల ముందు నుంచి ఈ రహదారిపై భారీ ట్రక్కులు, ట్రెయిలర్లు, కంటైనర్లు, అయిల్ ట్యాంకర్లు తదితర భారీ వాహనాలను నిషేధించనున్నారు. మళ్లీ ఉత్సవాలు ముగిసిన తర్వాత మూడు రోజుల వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. దీన్ని బట్టి ఈ రహదారిపై ప్రయాణికుల రాకపోకలు ఏ స్థాయిలో ఉంటాయో ఇట్టే ఊహించుకోవచ్చు. అయితే పాలు, డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ సిలిండర్లు, మెడికల్ ఆక్సిజన్, కూరగాయలు, నిత్యావసర సరుకులు తరలించే భారీ వాహనాలకు మినహాయింపు నిచ్చినట్లు ఆర్టీఓ అధికారులు వెల్లడించారు.

 ముంబై-గోవా రహదారిపై సాధారణ రోజుల్లోనే విపరీతంగా వాహనాల రద్దీ ఉంటుంది. గణేష్ ఉత్సవాలకు ముంబై నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. ఇప్పటికే రెగ్యూలర్ సర్వీస్‌లతో పాటు ప్రత్యేక రైళ్లు, ఆర్టీసీ బస్సుల బుకింగులు ఫుల్ అయ్యాయి. ఇక జీపు, కార్లు, టాటా సుమోలు, క్వాలిస్, బస్సు లాంటి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం మిగిలిపోయింది.

 ఉత్సవాలకు మూడు రోజుల ముందు నుంచి ముంబై-గోవా రహదారిపై ప్రయాణికులను చేరవేసే వాహనాల సంఖ్య గణనీయంగా ఉంటుంది. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా ఎక్కువే ఉంటుంది. దీన్ని దష్టిలో ఉంచుకుని ఏటా ఉత్సవాలకు ముందు, ముగిసిన తరువాత కొన్ని నిర్ధేశించిన రోజుల్లో భారీ వాహనాలకు నిషేధం విధిస్తారు. గతంలో ఉత్సవాల సమయంలో చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ప్రాణ, ఆస్తి నష్టం కూడా చాలా జరిగింది. రోడ్డు ప్రమాదాలవల్ల రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతాయి. దీంతో మిగతా వారు సకాలంలో తమ గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. వీరి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని గత పదేళ్ల నుంచి ఉత్సవాల సమయంలో ఆర్టీఓ అధికారులు ఈ రహదారిపై భారీ వాహనాలను నిషేధిస్తూ వస్తున్నారు.

>
మరిన్ని వార్తలు