బంద్‌ రోజే ఎక్కువ ప్రమాదాలట!

27 Jan, 2018 19:19 IST|Sakshi

బెంగళూరు : మహాదాయి నదీ నీటి పంపిణి విషయంలో గోవా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ గురువారం (జనవరి 25) కర్ణాటక వ్యాప్తంగా బంద్ చేపట్టిన సంగతి తెలిసిందే. దుకాణలు, షాపుల దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీల వరకు అన్నీ మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది. అయితే ఈ బంద్‌ రోజే, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగినట్టు తెలిసింది. రాష్ట్రీయ అంబులెన్స్‌ సర్వీసు 108 ఆరోగ్య కవచ జీవీకే ఈఎంఆర్‌ఐ విడుదల చేసిన డేటాలో ఈ విషయం వెల్లడైంది. తాము గురువారం రోజు 340 రోడ్డు ప్రమాద కాల్స్‌ను అటెండ్‌ చేశామని, ఇది 20.56 శాతం ఎక్కువని అంబులెన్స్‌ సర్వీసు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా సాధారణంగా రోజుకు 282 కేసులే వస్తాయన్నారు. బెంగళూరు సిటీలో కూడా కేసులు 12 శాతం పెరిగి 75 నమోదయ్యాయని పేర్కొంది. 

ఈ కాల్స్‌ను అర్థరాత్రి 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కాల్స్‌ వచ్చాయని అధికారులు తెలిపారు.  బంద్‌ రోజు ప్రజారవాణా వ్యవస్థ స్తంభించడంతో, ప్రజలు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించారని, భారీ ట్రాఫిక్‌ లేకపోవడం వల్ల కూడా హైస్పీడులో వాహనాలను దూసుకుపోయాయని పేర్కొన్నారు. దీంతో ప్రమాదాలు ఎక్కువగా జరిగాయన్నారు. ఈ ప్రమాదాల్లో ప్రజలకు ఎలాంటి ప్రాణ ముప్పు కలుగలేదన్నారు. అన్ని కేసుల్లో ప్రమాద బాధితులు, ఆసుపత్రులకు దగ్గరిలో వారనే తెలిపారు. బంద్‌ వల్ల కేవలం నగదు వృథా అవడమే కాకుండా.. ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయన్నారు. రోడ్డుపై తక్కువగా వాహనాలు తిరిగే రోజుల్లోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని ట్రాఫిక్‌ నిపుణులుఎంఎన్‌ శ్రీహరి తెలిపారు. నిర్లక్ష్యం, అజాగ్రత్తపరమైన డ్రైవింగ్‌, త్వరగా ఇంటికి వెళ్లాలనే ఆత్రుత ఇవన్నీ ప్రమాదానికి కారణమవుతాయన్నారు.  

మరిన్ని వార్తలు