ఒత్తిడిని ఎదుర్కొనేందకు బెంగళూరు వైద్యుల కొత్త ప్రయోగం

3 Jun, 2020 16:34 IST|Sakshi

బెంగళూరు: దేశంలో కరోనా వ్యాప్తి బయటపడిన నాటి నుంచి పోలీసులు, వైద్యులు ఇళ్లకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందిస్తున్నారు. రోజుల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటంతో కుంగుబాటుకు గురవుతున్నారు. ఈ క్రమంలో తమను తాము ఉత్సాహపర్చుకోవడం కోసం బెంగళూరు విక్టోరియా ఆస్పత్రి వైద్యులు ఓ నూతన మార్గాన్ని కనుగొన్నారు. పాత పాటలకు డ్యాన్స్‌ చేయడం, సహోద్యోగుల కోసం వంట చేయడం, మహిళలకు మెహందీ పోటీలు, పిల్లలకు డ్రాయింగ్‌ పోటీలు నిర్వహిస్తూ తమను తాము ఉత్సాహపర్చుకోవడమే కాక మిగతవారికి సంతోషాన్ని కల్గిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీపీఈ కిట్లు ధరించిన వైద్యులు ముగ్గురు.. 1960 నాటి హిందీ పాటలకు డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో వైద్యులు ‘లిఖే జో ఖాత్‌ తుజే’ పాటకు డ్యాన్స్‌ చేశారు. వీరంతా గత వారం రోజులుగా ఆస్పత్రిలోనే ఉంటున్నారు. 

ఈ సందర్భంగా డాక్టర్‌ అస్మా బాను మాట్లాడుతూ... ‘ప్రస్తుతం ఆసుపత్రిలో కరోనా వైరస్‌ సోకిన వారిలో 18 మంది పిల్లలు ఉన్నారు. వారిలో ధైర్యం నింపడం కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మహిళల కోసం మెహందీ.. పిల్లలకు డ్రాయింగ్‌ పోటీలు నిర్వహిస్తున్నాము. విజేతలకు బహుమతులు కూడా ఇస్తాము. పిల్లలు ఎక్కువగా చాక్లెట్లు, క్యారమ్ బోర్డులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక నేను డాక్టర్ బాలాజీ పైతో కలిసి మాకు కేటాయించిన గదిలో ఆహారాన్ని వండి ఇతర సిబ్బంది అందజేస్తున్నాం’ అని తెలిపారు

మరిన్ని వార్తలు