వేడి వేడి ఐస్‌ క్రీం దోసేయ్‌!.. ఫాల్తూ ఐటమ్స్‌..

21 Feb, 2020 13:28 IST|Sakshi
ఐస్‌ క్రీం దోస

జ్వరం వచ్చినపుడు ఇడ్లీని చక్కెరతో తినమని అమ్మ సలహా ఇస్తే.. కాంబినేషన్‌ నచ్చక తినడానికి తెగ ఇబ్బంది పడిపోయేవాళ్లం. కానీ, ఇడ్లీని, దోశను తియ్యగా వేడి వేడి ఐస్‌ క్రీంతో తినాల్సి వస్తే! ఆ ఆలోచనే వింతగా ఉంది కదూ. ఆ వింత ఆలోచనే ఓ టిఫిన్‌ సెంటర్‌ను కంట్రీ ఫేమస్‌ చేసేసింది. అందరిలా ఆలోచిస్తే మనకు పక్కోడికి తేడా ఏముంటుంది అనుకున్నాడు బెంగళూరులోని ఓ టిఫిన్‌ సెంటర్‌ యాజమాని. అందుకే కొత్తగా ఆలోచించాడు.

దోశ, ఇడ్లీ, వడలను చట్నీ, సాంబార్‌తోనే ఎందుకు తినాలి.. ఐస్‌ క్రీమ్‌తో తింటేపోలా.. అన్న ఆలోచనే తన వ్యాపారాన్ని మూడు ఐస్‌క్రీం ఇడ్లీలు.. ఆరు ఐస్‌క్రీం దోశల్లా ముందుకు నడిపిస్తోంది. ప్రస్తుతం ఆ టిఫిన్‌ సెంటర్‌ మెను సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. దీంతో ఆ టిఫిన్‌ సెంటర్‌ బిజినెస్‌ టైకూన్‌ ఆనంద్‌ మహీంద్ర దృష్టిలో పడింది. వారి సృజనాత్మకతకు ఆయన ఫిదా అయిపోయాడు.

ఐస్‌క్రీం ఇడ్లీ
‘‘నేను ఐస్‌ క్రీం దోసకు ఫ్యాన్‌ను కాను. అయినప్పటికి వారి సృజనాత్మకతకు ఫిదా అయ్యాను. దేశంలోని వీధి వర్తకులు తరిగిపోని సృజనాత్మకత గనులు. మా కంపెనీలో ప్రాడక్ట్‌ డిజైన్‌ విభాగంలో పనిచేసే వారిని ప్రతిరోజూ వీధి వర్తకులను కలిసి, స్ఫూర్తి పొందమని చెబుతా’ అంటూ టిఫిన్‌ సెంటర్‌ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో ఉంచి ట్వీట్‌ చేశారు. అయితే టిఫిన్‌ సెంటర్‌ ఐడియా అద్భుతం అంటూ కొంతమంది వారిని పొగడ్తలతో ముంచెత్తుతుంటే.. మరికొందరు ఇదేం బాలేదు అంటూ పెదవి విరుస్తున్నారు. ‘ ఫాల్తూ ఐటమ్స్‌.. ముందు ఎమ్‌ అండ్‌ ఎమ్‌ మీద దృష్టి పెట్టండి’ అంటూ ఓ నెటిజన్‌ మహీంద్రపై మండిపడ్డాడు.

మరిన్ని వార్తలు