మేకప్‌ చేయాలని బ్యూటీషియన్‌ను పిలిచి...

11 Feb, 2016 22:00 IST|Sakshi
మేకప్‌ చేయాలని బ్యూటీషియన్‌ను పిలిచి...

సాక్షి, బెంగళూరు: బెంగళూరు నగరంలో బ్యుటీషియన్‌గా పనిచేస్తున్న కోల్‌కతాకు చెందిన ఓ యువతి (22)పై దారుణం జరిగింది. మేకప్ వేయాలని పిలిపించి ఆమెపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. బాధితురాలు ఈ ఏడాది జనవరిలో బెంగళూరుకు వచ్చి ఓ బ్యూటీపార్లల్‌లో ఉద్యోగిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఈనెల 2న తమ ఇంట్లో ఓ యువతికి మేకప్ చేయాలంటూ ఆమె పనిచేస్తున్న బ్యూటీపార్లల్‌కు ఫోన్ వచ్చింది. దీంతో బ్యూటీపార్లల్ యజమాని ఆమెకు విషయాన్ని తెలిపి అడ్రస్ చెప్పారు.

యజమాని చెప్పిన చోటికి ఆమె కాలినడకన వెళ్తుండగా అదే ప్రాంతానికి చెందిన నితిన్‌శెట్టి, ధనుంజయ్, రజత్ అడ్డుకున్నారు. తాము మఫ్టీలో ఉన్న పోలీసులమని బెదిరించారు. 'నువ్వు వేశ్య వృత్తిలో ఉన్నావని' బెదిరిస్తూ విచారణ కోసమంటూ ఆ యువతిని కారులో బలవంతంగా ఎక్కించుకున్నారు. అనంతరం దగ్గర్లోని నిర్జన ప్రదేశంలోని గోదాములోకి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఉడాయించారు. మరుసటి రోజు ఉదయం యజమాని సాయంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నగరంలోనే వేర్వేరుచోట్ల తలదాచుకున్న ముగ్గురు యువకులను గురువారం అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు