అధికార మార్పిడి వెనుక చీకటి రాజకీయం

8 Dec, 2016 03:48 IST|Sakshi
అధికార మార్పిడి వెనుక చీకటి రాజకీయం

- పళని స్వామిని సీఎం చేయాలనే ఆలస్యంగా జయ మరణ వార్తను ప్రకటించారా?
- అమ్మ మరణ వార్త ముందుగానే తెలిసి మంత్రులు, ఎమ్మెల్యేలను అపోలోకు పిలిపించిన శశికళ.. పన్నీర్ లేకుండానే వారితో తెల్లకాగితాల మీద సంతకాలు
- అర్ధరాత్రి 12 గంటలకు అన్నా డీఎంకే శాసనసభాపక్ష భేటీ
- 12.30 గంటలకు శాసనసభా పక్ష నేతగా పన్నీర్ ఎన్నిక
- ఆగమేఘాల మీద తెల్లవారుజామున 1.25 గంటలకు పన్నీర్ ప్రమాణం
- అపోలో ఆసుపత్రిలో జయ పార్థివదేహం చుట్టూ శశికళ బంధువులు ఎలా చేరారు?
- అంత్యక్రియల్లో శశికళ.. జయ కుటుంబీకులను అక్కడికి ఎందుకు రానీయలేదు?
- ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటపడుతున్న వాస్తవాలు

 
 చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  తమిళనాడులో అధికార మార్పిడి పైకి కనిపించినంత సులువుగా జరగలేదు. సోమవారం అర్ధరాత్రి 11.30 గంటలకు జయలలిత మృతి చెందినట్లు అధికారిక ప్రకటన వెలువడటానికి ముందు చాలా తతంగం చోటుచేసుకుంది. జయలలిత నెచ్చెలి శశికళ ఒక్కసారిగా ప్రభుత్వాన్ని, పార్టీని సొంతం చేసుకోవడానికి పావులు కదిపారు. జయలలిత దూరంగా పెట్టిన శశికళ భర్త నటరాజన్‌తో పాటు ఆమె బంధువర్గం అంతా ఒక్కసారిగా అక్కడికి వచ్చి వాలింది. పన్నీర్ సెల్వంకు బదులు తనకు నమ్మకస్తుడైన మంత్రి పడపాటి పళని స్వామిని ముఖ్యమంత్రిని చేయడానికి శశికళ శరవేగంగా వ్యూహం రచించారు.

తమిళనాడు అధికార పీఠం కోసం జరగరానిది జరిగిపోతోందని సమాచారం అందడంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. ఆగమేఘాల మీద కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెన్నై రావడం, రాత్రికి రాత్రే పన్నీర్ సెల్వంతో పాటు మంత్రి వర్గంతో గవర్నర్ విద్యా సాగరరావు పదవీ ప్రమాణ స్వీకారం చేరుుంచడం చకచకా జరిగిపోరుుంది. జయలలిత పార్థివదేహం ఆసుపత్రిలో ఉండగానే అపోలో ఆసుపత్రి వేదికగా శశికళ రాజకీయం నడిపిన తీరు ఒక్కొక్కటిగా ఇపుడు బయటకు వస్తోంది. జయలలిత అంత్యక్రియలు ముగిసి పార్టీలో పదవులు, కుల సమీకరణల ముసలం మొదలైన నేపథ్యంలో శశికళ వ్యతిరేక వర్గం గళం విప్పుతోంది. అన్నాడీఎంకేలో విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు.. అపోలో ఆసుపత్రి వేదికగా సోమవారం ఏం జరిగిందంటే..

► సోమవారం (5-12-16) మధ్యాహ్నం 2.30 గంటలకు అమ్మ చనిపోరుునట్లేనని వైద్య బృందాలు శశికళతో పాటు పన్నీర్ సెల్వంకు సమాచారం ఇచ్చాయి.
► కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా, గవర్నర్ విద్యా సాగరరావుకు అపోలో ముఖ్యులు ఈ విషయం చేరవేశారు.
►ఈ పరిణామాల నేపథ్యంలోనే శశికళ సాయంత్రం 4 గంటలకు అపోలో ఆసుపత్రి రెండో అంతస్తులో పన్నీర్ సెల్వం లేకుండానే మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. సమావేశానికి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలతో మూడు తెల్లకాగితాల మీద  సంతకాలు చేరుుంచుకున్నారు. ఈ సంతకాలు ఎందుకు అని తెలుసుకునే అవకాశం కూడా వారికి ఇవ్వలేదు. ఇందులో ‘ఒకటి పళని స్వామిని సీఎంగా చేయడానికి, రెండోది తనను (శశికళ)పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు, మూడోది అమ్మ మృతికి అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి సంబంధం లేదు.. వారు ఆమెను బతికించడానికి శక్తికి మించి ప్రయత్నం చేశారు’ అని తర్వాత వారికి తెలిసింది. అపోలో వేదికగా జరుగుతున్న రాజకీయ నాటకం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది.
► రాత్రి 7గంటలకు వెంకయ్య నాయుడు చెన్నై అపోలో ఆసుపత్రికి వచ్చారు. శశికళతో మాట్లాడారు.
► రాత్రి 8 గంటలకు శశికళ మరోసారి తన మద్దతు దారులతో సుదీర్ఘంగా సమావేశం అయ్యారు.
►రాత్రి 12 గంటలకు పన్నీర్ సెల్వంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పన్నీర్ సెల్వంను శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
► సరిగ్గా ఇదే సమయంలో అపోలో ఆసుపత్రి వర్గాలు రాత్రి 11.30 గంటలకు జయలలిత చనిపోయినట్లు ప్రకటించాయి.
► రాత్రి 12.45 గంటలకు పన్నీర్ సెల్వంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్ భవన్‌కు చేరుకున్నారు.
► మంగళవారం తెల్లవారు జామున 1.25 గంటలకు పన్నీర్ సెల్వంతో పాటు జయలలిత కేబినెట్‌లోనిమంత్రులందరితో పదవీ ప్రమాణా స్వీకారం చేరుుంచారు.

 భౌతికకాయం చుట్టూ శశికళ బంధువులే..
 జయలలిత చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించక ముందే శశికళతో పాటు, జయలలిత దూరం పెట్టిన వారంతా ఆమె చుట్టూ చేరారు. తెల్లవారు జామున 2.30 గంటలకు ఆసుపత్రి నుంచి జయ పార్థివ దేహం పోయెస్ గార్డెన్‌కు చేరుకుంది. అక్కడ కూడా జయలలిత బంధువులెవరికీ అవకాశం ఇవ్వకుండా శశికళ, ఆమె భర్త నటరాజన్, శశికళ బంధువులు ఇళవరసి, సుధాకర్, రావణన్, దివాకరన్ శవం చుట్టూ చేరిపోయారు. అక్కడి నుంచి రాజాజీ హాల్‌కు, మెరీనా బీచ్ ఒడ్డున అంతిమ సంస్కారం పూర్తయ్యే వరకు కూడా జయ భౌతికకాయం చుట్టూ గుమికూడి వేరెవరికీ చోటేలేకుండా చేశారు. ఖననం చేసే సమయంలోనూ జయలలిత కుటుంబ సభ్యులను దగ్గరికి రానివ్వకుండా శశికళే ఈ తంతు ముగించడం విమర్శలకు దారి తీసింది.

 మొదట తెలిసింది శవపేటికల వ్యాపారికే
 జయలలిత మరణించిన విషయం అపోలో వర్గాలు అర్ధరాత్రి 12 గంటలకు ప్రకటిస్తే శవపేటికలు తయారు చేసే ఫ్లరుుంగ్ స్క్వాడ్ అండ్ హోమేజ్ కంపెనీ ఎండీ శాంతకుమార్‌కు సాయంత్రం 5.30 గంటలకే తెలిసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శాంతకుమార్ స్వీయ పర్యవేక్షలో కఫిన్‌తో కూడిన హెవీ డ్యూటీ ఫ్రీజర్ బాక్స్ గంటల వ్యవధిలోనే అపోలో ఆసుపత్రికి తీసుకుని వచ్చారు.