కొట్టకుండానే మోగుతున్న గంట.. మర్మమేంటో

15 Jun, 2020 12:18 IST|Sakshi

భోపాల్‌ : దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు సడలింపులు ఇవ్వడంలో జూన్‌ 8 నుంచి దేవాలయాలు ప్రారంభం అ‍య్యాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండటంతో వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రార్థనాలయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్‌లోని మాంద్‌సౌర్‌లో గల ప్రముఖ ప్రజాపతి ఆలయంలో అధికారులు వినూత్న ఆలోచన చేశారు. గుడిలో గంటను ముట్టుకోవడం ద్వారా భక్తులకు వైరస్‌ వ్యాప్తిచెందే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావించారు. దీంతో గంట కొట్టకుండానే మోగేలా ఏర్పాట్లు చేశారు. వినడానికి కొంత ఆశ్చర్యంగానే ఉన్నా.. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేసి చూపించారు. భక్తులు గంట దగ్గరకు వెళ్లగానే సెన్సార్‌ల సహాయంతో మోగేలా బెల్‌ను రూపొందించారు. దీనికి స్థానిక ముస్లిం వ్యక్తి తనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బెల్‌ను ఆవిష్కరించారు. (సీఎం ఎడిటెడ్‌ వీడియో పోస్ట్‌ .. దిగ్విజయ్‌పై కేసు)

దీనిపై ఆలయ అధికారులు మాట్లాడుతూ.. ‘గుడిలోకి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. భౌతిక దూరం పాటిస్తూ వైరస్‌ వ్యాప్తిని నిరోధిస్తున్నాం. దానిలో భాగంగానే గంటను ఒకరుతాకిన తరువాత మరోకరు తాకడం మూలంగా వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ముందే గుర్తించాం. దానికి కూడా స్థానిక వ్యక్తి సహాయంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సెన్సార్లను ఏర్పాటు చేశాం. భక్తులు గంట దగ్గర వచ్చి నిల్చుంటే చాలు దానంతట అదే మోగుతుంది.’ అని వివరించారు. ఇక ఆలయ అధికారులు  వినూత్న ఆలోచనలకు ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుతున్నాయి. భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (24 గంటల్లో 11,502 పాజిటివ్‌ కేసులు)

మరిన్ని వార్తలు