డార్జిలింగ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత

8 Aug, 2013 06:17 IST|Sakshi
డార్జిలింగ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత

డార్జిలింగ్/గువాహటి/న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించిన దరిమిలా గూర్ఖాలాండ్ డిమాండ్‌తో డార్జిలింగ్ పర్వతప్రాంతంలో మొదలైన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. గూర్ఖాలాండ్ జనముక్తి మోర్చా (జీజేఎం) పిలుపు మేరకు కొనసాగుతున్న నిరవధిక బంద్ బుధవారం ఐదోరోజుకు చేరుకుంది. డార్జిలింగ్, కలింపాంగ్, మిరిక్, సుఖిపొక్రీ, కుర్సియాంగ్ తదితర పట్టణాల్లో జనజీవనం స్తంభించింది. కేంద్రం నుంచి చేరుకున్న ఐదు కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు ఈ ప్రాంతాల్లో పహారా కాస్తున్నాయి. ఒకవైపు బంద్ కొనసాగుతుండగా, మరోవైపు పోలీసులు పాత కేసులకు సంబంధించి అరెస్టులు సాగిస్తున్నారు. జీజేఎంలోని గూర్ఖాలాండ్ పర్సనల్ (జీఎల్‌పీ) విభాగానికి చెందిన 32 మందిని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. దీంతో అరెస్టయిన వారి సంఖ్య 143కు చేరుకుంది. డార్జిలింగ్ ప్రాంతంలోని పరిస్థితులను సమీక్షించేందుకు వచ్చిన పశ్చిమ బెంగాల్ హోంశాఖ కార్యదర్శి బాసుదేవ్ బెనర్జీకి ఉద్యమకారుల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. ఉద్యమకారులు ఆయన వాహనాన్ని అడ్డుకోవడంతో ఎస్పీ కార్యాలయం నుంచి ఆయన సమీపంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆయన కాలినడకనే వెళ్లాల్సి వచ్చింది.  
 
 కర్బీ-ఆంగ్లాంగ్‌లో కర్ఫ్యూ సడలింపు
 అస్సాంలోని కర్బీ-ఆంగ్లాంగ్ జిల్లాలో బుధవారం కర్ఫ్యూను సడలించారు. కర్బీ-ఆంగ్లాంగ్, బోడోలాండ్, కామ్తాపూర్ రా ష్ట్రాల డిమాండుతో అస్సాంలో వివిధ సంస్థ లు, పార్టీల నేతృత్వంలో రెండు రోజులు కొనసాగిన బంద్‌లు బుధవారం ముగిశా యి. మరోవైపు బోడో నాయకులు ఢిల్లీలో ప్రధాని మన్మోహన్‌ను కలుసుకుని, తమ డిమాండ్‌ను వినిపించారు. తమ డిమాండు పై ఉన్నతస్థాయిలో చర్చించనున్నట్లు ప్ర ధాని హామీఇచ్చారని చెప్పారు.  ఈ అంశం పై బాధ్యతలను హోంమంత్రి షిండేకు అప్పగించనున్నట్లు చెప్పారన్నారు.

మరిన్ని వార్తలు