బెంగాల్‌ వర్సెస్‌ సీబీఐ : కేంద్రానికి గవర్నర్‌ నివేదిక

4 Feb, 2019 16:09 IST|Sakshi

కోల్‌కతా : మమతా బెనర్జీ సారథ్యంలోని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం, కేంద్రం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో దీనికి కేంద్ర బిందువైన కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ నివాసంపై సీబీఐ దాడుల ఉదంతానికి సంబంధించి రహస్య నివేదికను బెంగాల్‌ గవర్నర్‌ కేంద్రానికి సమర్పించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బెంగాల్‌ గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠితో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించిన మీదట కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు గవర్నర్‌ నివేదికను పంపారు.

కాగా బెంగాల్‌లో సీబీఐ దాడులను రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తూ ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఢిల్లీలో సత్యాగ్రహ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. దీదీకి విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించిన క్రమంలో ప్రతిపక్షాలు అవినీతిని సమర్ధిస్తున్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిని విచారించడం నేరమా అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పరిమితులను దాటారని మండిపడ్డారు. అవినీతిలో ప్రమేయం ఉందన్న వ్యక్తులను విచారించడం నేరమన్నట్టు విపక్షాలు వ్యవహరించడం బాధాకరమన్నారు.

>
మరిన్ని వార్తలు