ప్యాసింజర్ల వేషంలో ఆటోవాలాలకు షాక్‌

4 Dec, 2019 16:27 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

 ప్యాసింజర్ల వేషంలో ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌

నిబంధనలను పాటించని  ఆటోవాలాలకు భారీ జరిమానా

సాక్షి,బెంగళూరు: బెంగళూరులో ఆటో డ్రైవర్లకు పోలీసులు గట్టి షాకిచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న5,200 మందికి పైగా డ్రైవర్లను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని, జరిమానా విధించారు.  ప్యాసింజర్లలా నటించి మరీ వారిపై నిఘా పెట్టారు ట్రాఫిక్ పోలీసులు. నగరంలోని 7 మండలాల్లోని డ్రైవర్లనుంచి రూ.8,06,200 జరిమానా వసూలు చేశారు.

ఆటో డ్రైవర్లపై పలు ఫిర్యాదుల నేపథ్యంలో కొన్ని జోన్లలో ఈ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టినట్టు జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) బీఆర్ రవికాంత్ గౌడ తెలిపారు. నగరంలోని ఇతర మండలాల్లో  కూడా త్వరలో ఇలాంటి డ్రైవ్‌లు నిర్వహిస్తామన్నారు. పదిమంది ఆటో డ్రైవర్లలో ఇద్దరు మాత్రమే మీటర్‌పై 4-5 కిలోమీటర్ల దూరానికి వెళ్లడానికి అంగీకరించినట్టు తేలిందని పోలీసు అధికారి తెలిపారు. యూనిఫాం ధరించకపోవడం, సరియైన పత్రాలు లేకపోవడంతోపాటు, కొన్ని ఏరియాలకు వెళ్లడానికి నిరాకరించడం, ఎక్కువ ఛార్జీలు డిమాండ్ చేయడం, మీటర్‌ చార్జీల కంటే ఎక్కువ వసూలు లాంటి ఆరోపణలపై పలువురు ఆటో డ్రైవర్లు బుక్‌ అయ్యారు. నేరస్థులుగా తేలిన వారికి భారీ జరిమానా విధించారు. అలాగే కొన్ని ఆటోలను సీజ్‌ చేశారు. 

కొంతమంది ఆటో డ్రైవర్లు అధికంగా ఛార్జ్ చేస్తున్నందున, అన్ని ఆటో డ్రైవర్లకు చెడ్డ పేరు వస్తోందని బెంగళూరులోని ఆదర్ష్ ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు నారాయణ్ స్వామి తెలిపారు. దీంతో ప్రజలు ఆటోలకు బదులుగా ఉబెర్/ఓలా క్యాబ్‌లవైపు మొగ్గు చూపుతున్నారనీ, ఇది తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో కూడా ఇలాంటి డ్రైవ్‌ చేపట్టిన బెంగళూరు పోలీసులు 6800 కేసులను నమోదు చేశారు. అలాగే జరిమానాగా రూ. 72 లక్షలను వసూలు చేసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు