బెంగళూరులో గూగుల్‌ ఉద్యోగికి కరోనా

13 Mar, 2020 10:42 IST|Sakshi

బెంగళూరు : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లో కూడా పంజా విసురుతోంది. తాజాగా తమ ఉద్యోగికి కరోనా వైరస్‌ సోకినట్టు గూగుల్‌ సంస్థ తెలిపింది. బెంగళూరు ఆఫీసులో పనిచేసే వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలిందని వెల్లడించింది. ఈ మేరకు గూగుల్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా లక్షణాలు బయటపడానికి ముందు  కొన్ని గంటలు అతను ఆఫీసులో విధులు నిర్వర్తించాడని పేర్కొంది. కరోనా వ్యాపించకుండా జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తించాలని ఇతర ఉద్యోగులను కోరింది. అలాగే కరోనా సోకిన వ్యక్తికి సన్నిహితంగా ఉన్నవారు స్వీయ నిర్భందంలో ఉండాల్సిందిగా సూచించింది. కాగా, కరోనా సోకిన వ్యక్తి ఇటీవల గ్రీస్‌ దేశానికి వెళ్లి వచ్చినట్టుగా తెలుస్తోంది. 

కరోనా పాజిటివ్‌గా తేలిన గూగుల్‌ ఉద్యోగిని బెంగళూరు హాస్పిటల్‌లోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచినట్టు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బి శ్రీరాములు తెలిపారు. మరోవైపు కరోనా వైరస్‌ కారణంగా భారత్‌లో తొలి మరణం నమోదైన సంగతి తెలిసిందే. బుధవారం కర్నాటక కలబుర్గిలో చనిపోయిన 76 ఏళ్ల వృద్ధుడు మహమ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ కరోనా వైరస్‌తోనే చనిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు భారత్‌లో 74 మందికి కరోనా సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 

చదవండి : భారత్‌లో తొలి మరణం

కరోనా బారిన ఆ దేశ ప్రధాని భార్య..

>
మరిన్ని వార్తలు